అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అధ్యక్షత సచివాలయంలో నేడు జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రి మండలి చర్చించింది. ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్ఆర్ చేయూత పథకంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.
ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
వైఎస్ఆర్ చేయూత పథకానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 12న పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం నిధులపై మంత్రివర్గంలో చర్చించారు. ఐదు దశల్లో రామాయపట్నం పోర్టును నిర్మించాలనీ, కేంద్రం నిధుల కోసం ప్రయత్నిస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు. మొదటి దశలో రూ.4,736 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు సీఎం వివరించారు. ఆగస్టు నాటికి పోర్టు నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపించాల్సిందిగా అధికారులకు తెలిపారు.
సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వివరించారు. నవరత్నాల్లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 45 నుంచి 60 ఏళ్లు గల ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలకు ఏడాదికి రూ. 18,750 వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఆర్థిక సాయాన్ని అందిస్తామనీ, ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలకు లబ్ధిచేకూరుతుందానీ తెలిపారు.
గర్భిణీలు, చిన్న పిల్లల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల నిర్వహణకు గాను రూ. 18 వేల కోట్లకు పైగా ఖర్చుకు ఆమోదం తెలిపామన్నారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో రూ.153 కోట్లతో విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించిందని, రాష్ట్రంలోని పేదలు ఉన్నత చదువులు చదివేందుకు గాను జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అందిస్తామనీ చెప్పారు. ఏడాదికి 4 విడతల్లో తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రూ.5 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీని స్థాపించాలని సీఎం జగన్ సూచించారని మంత్రి పేర్ని తెలిపారు.
రాష్ట్రంలోని రైతులకు పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం రూ. 8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వ్యయం అవుతందని, ఇందుకు గాను సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ అంగీకరించారని తెలిపారు. అందు కోసం ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు నిధులు వెచ్చించాలని నిర్ణయించామన్నారు. గండికోట రిజర్వాయర్లో పూర్తి సామార్థ్యం మేర నింపేందుకు ప్రణాళిక రూపొందించామని, మంత్రి మండలి ఆమోదంతో రిజర్వాయర్లో 26.85 టీఎంసీల నిల్వ కోసం రూ. 500 కోట్లకు పైగా వెచ్చించనున్నామని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా 2,200 కోట్ల రూపాయాలను ప్రభుత్వం ఆదా చేసిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.