రాజమండ్రికి చెందిన సీనియర్ మోస్ట్ టిడిపి నాయకుడు ,సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు కు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఆమె సీటుకే ఎర్త్ పెట్టే విధంగా బుచ్చయ్యచౌదరి పావులు కదుపుతున్నారట.రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్యచౌదరి వయసు మీద పడ్డంతో వచ్చే ఎన్నికల నాటికి అమెరికాలో ఉంటున్న తన సోదరుడి కుమారుడి నొకరిని రంగంలోకి తెస్తున్నారు.అయితే ఆయన రూరల్ సీటు మీద కాకుండా అర్బన్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం ఇక్కడ విశేషం.ఇప్పటికే ఆయన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చాలా మెలికలు పెడుతున్నారు.ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని బలహీన పరిచే ప్రయత్నాలు బుచ్చయ్య చౌదరి సాగిస్తున్నారన్నారు.టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్న బుచ్చయ్యచౌదరికి రాజమండ్రిలో పార్టీపై పట్టు ఎక్కువే.దీంతో ఆయన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో తన వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారు .ఇది ఆదిరెడ్డి భవానీ వర్గం భరించలేకపోతోంది.
ఈ నేపధ్యంలో ఆదిరెడ్డి భవానీ మామ అప్పారావు వైసిపి వైపు చూస్తున్నారట.ఆదిరెడ్డి అప్పారావు వాస్తవంగా వైసీపీ బార్ను లీడర్.వైసిపి ఆవిర్భావం తరవాత జగన్మోహన్రెడ్డి తొలి ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది అప్పారావుకే.అయితే తదుపరి పరిణామాల్లో అప్పారావు టిడిపి వైపు వచ్చారు.కానీ ఇప్పటికీ ఆయనకు వైసిపి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి.మొన్నటి ఎన్నికల్లో ఫేస్ వాల్యూ కోసం తన కోడలు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానిని రంగంలోకి దింపిన ఆదిరెడ్డి అప్పారావు రేపటి ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ తరుణంలో బుచ్చయ్యచౌదరి అర్బన్ సీటులో వేలెట్టి తన వారసుడికి ఆ టిక్కెట్లు ఇప్పించుకునే పథక రచనలో ఉండడం ఆదిరెడ్డి అప్పారావుకు ఇబ్బందికరంగా మారింది.దీంతో ఆయన అవసరమైతే కుటుంబంతో సహా తిరిగి వైసిపిలోకి వెళ్లిపోయే యోచన చేస్తున్నారట.ఇదే జరిగితే ఏపీ టీడీపీకి అచ్చెన్నాయుడు తలెత్తుకోలేరు.ఆయన అన్న కుమార్తె కూడా వైసీపీలోకి వెళితే ఇక టిడిపి క్యాడర్ కు ఆయనేమి సమాధానం చెప్పగలరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.మొత్తం మీద రాజమండ్రి టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది.