న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్లోనూ కనిపిస్తోంది. జైపూర్,డిల్లీ, హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తితోపాటు, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలంగాణకు చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వీరిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే కేరళలో మూడు పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా తాజాగా హైదరాబాద్, ఢిల్లీ కేసులతో మొత్తం అయిదుకు చేరినట్లు అధికారికంగా గుర్తించారు.
కాగా కరోనా వైరస్ అనుమానిత రోగి ఒకరు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ వైద్యకళాశాలలో చేరడం కలకలం సృష్టించింది. చైనా దేశంలో ఎంబీబీఎస్ చదివిన వైద్య విద్యార్థి తిరిగి భారతదేశానికి రాగా అతనికి కరోనా వైరస్ లక్షణాలున్నాయననీ, దీంతో అతన్ని జైపూర్ నగరంలోని ఎస్ఎంఎస్ వైద్యకళాశాలలోని ఐసోలేషన్ వార్డుకు తరలించామని రాజస్థాన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు.కరోనా వైరస్ అనుమానిత రోగితో పాటు అతని కుటుంబసభ్యుల రక్త శాంపిళ్లను సేకరించి పరీక్షించేందుకు పూణే నగరంలోని జాతీయ వైరాలజీ లాబోరేటరీకి పంపించామని అయన చెప్పారు. చైనా దేశం నుంచి 18 మంది రాజస్థాన్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు తిరిగి వచ్చారనీ, వారందరినీ తమ వైద్యాశాఖ అధికారులు, వైద్యులు 28 రోజుల పాటు పరిశీలిస్తున్నారనీ మంత్రి రఘుశర్మ తెలిపారు. చైనా నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో వైద్యులు పరీక్షలు జరిపించిన తర్వాతే వారి స్వస్థలాలకు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అయన కోరారు.
తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు ధ్రువీకరణ కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. దేశంలో ఇప్పటి వరకు అయిదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 12 దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి చెప్పారు.
12 పెద్ద ఓడ రేవులు, 65 చిన్న ఓడ రేవులు, 21 ఎయిర్ పోర్టు లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, వైరస్పై హెల్ప్లైన్ నంబర్ 01123978046ను ఏర్పాటు చేశామనీ తెలిపారు. ఈ నంబర్కు ఇప్పటి వరకు 6,300 ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన వివరించారు. వైద్య పరీక్షల కోసం కొత్తగా 15 లేబొరేటరీలు అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. కొన్ని దేశాల పర్యటనలకూ వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.