ప్రస్తుతం దేశంలో…, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి చేరుతుంది. గంటల్లోనే కోట్లాది మందిని చేరింది. అదే… “వచ్చే ఆదివారం నుండి సోషల్ మీడియాకి దూరమవనున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించడం. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. “వచ్చే ఆదివారం నుండి ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టా గ్రామ్, యూట్యూబ్ నుండి వైదొలుగుతున్నాను” అంటూ ఈరోజు రాత్రి 8.56కి ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించగా… గంటల్లోనే 15 వేల మంది రీట్వీట్ చేశారు. వేలాదిమంది కామెంట్లు పెట్టి, కారణాలు అడుగుతున్నారు. కొందరు సెటైర్లు వేస్తున్నారు. రాజీనామా కూడ చేసేయకపోయారా? అంటూ కొందరు కామెంట్లు పెట్టడం, ఆ కామెంట్లకు లైకులు ఎక్కువగా రావడం చర్చకు దారితీసింది. అసలు ప్రధాని మోదీ ఆకస్మికంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
“ఇన్ స్టా, ట్విట్టర్లో ప్రపంచంలో అత్యధిక ఫాలోయర్లు ఉన్న నాయకుల్లో ఆయన ప్రథమంగా ఉన్నారు. 2009 నుండి ఆయన సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ప్రతి అంశాన్ని వెల్లడిస్తారు. ట్విట్టర్ ని దేశంలో అత్యంత ప్రభావితంగా వాడుతున్న నాయకుల్లో ఆయనే ముందుంటారు. ఒక రకంగా రాజకీయ నాయకులకు సోషల్ మీడియాని వాడడంలో మోడీ ఆదర్శంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో మోడీ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఊసులు, ఊహలకు దారితీసింది. ఇక ఆయన ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉంటాయని కొందరు పేర్కొంటున్నారు. బహుశా ఆయనే స్వయంగా ఈ ఆదివారంలోగా కారణాలు వెల్లడించే అవకాశం ఉందేమో వేచి చూడాలి.