AP BJP: సోషల్ మీడియాలో ఏవరో ఏదో సందేశం ఇస్తే దానికి బీజేపీ రియాక్ట్ కావడం, సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా, చర్చనీయాంశంగా మారుతోంది. లౌకిక రాజ్యమైన భారతదేశంలో కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. కానీ పలు రాజకీయ పార్టీలు మాత్రం మతాల పరంగా వైరుధ్యాలను సృష్టించి రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నాయి. వీరికి తగ్గట్టుగానే ప్రత్యర్థుల సందేశాలు, ప్రసంగాలు ఉంటున్నాయి. ఏపి బీజేపీ శాఖ తాజాగా తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో ఓ వివాదాస్పదమైన వీడియోను షేర్ చేస్తూ ఆ సందేశానికి కౌంటర్ ఇచ్చింది. ఇది ఇప్పుడు ఏపి రాజకీయ వ్యవహారాల్లో మరో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఏపి పబ్లిక్ సర్వీస్ కమిషనర్ సభ్యుడుగా నూతలపాటి సోనీ వుడ్ ను ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ నియమించింది. ఆయన తన ప్రసంగంలో రాబోయే ఎన్నికల్లో క్రీస్తు, యెహోవా నిస్సీ జెండాలు పట్టుకుని పోరాడబోతున్నామంటూ వ్యాఖ్యానించిన వీడియోను ఏపి బీజేపీ షేర్ చేసింది. యుద్ధం పట్ల ఉత్సాహం చూపే గుర్రం ఆత్మను దేవుడు తనకు ఇచ్చాడనీ, అలాంటి ఆత్మ కలిగి ఉన్న వాళ్లు తనతో కలిసి నడవాలని సోనీ వుడ్ పిలుపు నిచ్చారు. దీనికి ఏపీ బీజేపీ బదులు ఇస్తూ “ మీరు చెప్పినట్లుగానే 2024 ఎన్నికలు రాముడికి, క్రీస్తుకు మధ్యనే జరగనివ్వండి.. ఫలితాన్ని ఏపి ప్రజలే నిర్ణయిస్తారు” అని పేర్కొంది.
రాజకీయ పార్టీ నేతలైనా, ప్రభుత్వాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వారైనా కుల, మత, ప్రాంత విభేదాలు, వైరుధ్యాలకు తావు లేకుండా నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ మన దౌర్భాగ్యం బ్రిటీష్ వాడు అమలు చేసి వెళ్లిన డివైడ్ అండ్ రూల్ పాలసీని మన వాళ్లు వంట బట్టుకున్నారు.
కొసమెరుపు ఏమిటంటే ఏపి బీజేపీ నిన్న షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటిది కాదు. 2018 అక్టోబర్ నెలలో సోనీ వుడ్ ఫేస్ బుక్ పేజీలోనిది. ఏపి బీజేపీ పాత వీడియోను షేర్ చేస్తూ కామెంట్స్ చేయడం విమర్శలకు దారి తీస్తుంది.
ముఖ్యమంత్రి @ysjagan ఇటీవలే నియమించిన AP పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నూతలపాటి సోనీ వుడ్, రాబోయేటువంటి ఎన్నికలలో 'క్రీస్తు,యెహోవా నిస్సి' జెండాలతో పోరాడబోతున్నాము, యుద్ధంలో పాల్గొనే గుఱ్ఱం ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. నాతో కలిసి రండి అని మాట్లాడారు. pic.twitter.com/y9ax05ymAl
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) May 22, 2021