YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నాలుగో దఫా విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ బృందం గత 12 రోజులుగా పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. అయితే ఈ విచారణ సందర్భంలో డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, వివేకా పిఏగా పని చేసిన జగదీశ్వరరెడ్డి, వైసీపీ కార్యకర్తలు రమణ, కరుణాకర్, కిరణ్ కుమార్ యాదవ్ అతని సోదరుడు సునీల్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు ఘటన జరిగిన రోజు అనుమానాస్పదంగా ఇన్నోవా వాహనంలో పులివెందులలో సంచరించిన ఇరికటవేముల రవి అలియాస్ మట్కా రవి, అతని డ్రైవర్ గోవర్థన్ తదితరులను విచారించారు. ఈ విచారణలో సీబీఐ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.
వివేకా కుమార్తె ఇచ్చిన అనుమానితుల జాబితాలో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఆమె ఇచ్చిన పేర్లలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, సీఐ గంగిరెడ్డి, ఘటన జరిగిన రోజు కట్టుకట్టిన వైద్యుడు శంకర్ రెడ్డి తదితర 14 మంది పేర్లు ఉన్నాయి. సీబీఐ అధికారుల మొదటి రెండు మూడు దశల్లో పెద్ద పెద్ద వ్యక్తులను విచారించారు. సిట్ అధికారులు కూడా వారిని విచారించారు. అయితే నాల్గవ దశ విచారణలో సీబీఐ అధికారులు పెద్ద పెద్ద వ్యక్తులను వదిలివేసి చిన్న చిన్న వ్యక్తులను పిలిపించి విచారణ జరుగుతుండటంతో కేసు పక్కదారి పడుతుందా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే వివేకా హత్య కేసులో పాత్రదారులప ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీబీఐ.. సాక్షాలు, అధారాల సేకరణలో పూర్తిగా నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పూర్తి అధారాలను సేకరించిన తరువాత అసలైన హంతకులను అరెస్టే చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. విచారణలో భాగంగా 12వ రోజు వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని, కడపకు చెందిన చిన్నపరెడ్డి, లక్ష్మీరెడ్డి అనే వ్యక్తులను విచారించారు.
డీఐజీ క్యాడర్ కల్గిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి సుధాసింగ్ నేతృత్వంలో 8 మంది సిబీఐ డీఎస్పీల బృందం వివేకా హత్య కేసు దర్యాప్తును జరుగుతోంది. ఆమెకు క్రిమినల్ కేసుల పరిష్కారంలో మంచి పట్టు ఉందని సమాచారం. సుధాసింగ్ తన బృందంతో కడప, పులివెందులలో తిరుగుతూ విచారణను వేగవంతం చేశారు. వివేకా హత్య కేసును ఛేదించేందుకు మరింత లోతుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారనీ, అ క్రమంలోనే ప్రతి ఒక్క అంశంపైనా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారని అంటున్నారు. చిన్న చేపను ఎర వేసి పెద్ద చేప పట్టే విధంగా దర్యాప్తు సాగుతొందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సారి దర్యాప్తులో మాత్రం హత్యకేసుకు సంబంధించి కొంత మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు చార్జి షీటు ధాఖలు చేయడం ఖాయమన్న మాట వినబడుతోంది. సీబీఐ కేసు టేకప్ చేసిన తరువాత కూడా ఏడాదిన్నరగా ఒక్క అరెస్టు జరగగపోవడంపై పలు ఆనుమానాలు ప్రజల నుండి వినబడుతున్నాయి.