కడప : దేశంలో మొట్టమొదటి సారిగా కడప కేంద్ర కారాగారంలో నాలుగు కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్కు నేడు హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత శంకుస్థాపన చేశారు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ స్విట్జర్లాండ్లో మాత్రమే ఉంది. దేశంలోనే మొదటిసారిగా కడప జైలులో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లిన తరవాత స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉన్నత జీవితం గడపాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని సుచరిత అన్నారు.
ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు బహిరంగ మార్కెట్లోని వస్తువులతో పోటీ పడుతున్నాయని చెప్పారు. జైళ్లలో నాణ్యతతో కూడిన వస్తువులు తయారు చేస్తున్నారన్న గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. కడప జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్లో నాణ్యమైన పెట్రోల్ లభిస్తోందని చెబుతున్నారని వివరించారు.రు. జైలులో ఇప్పటికే డైరీ యూనిట్, బ్రిక్స్ తయారీ, ఫినాయిల్, సోప్, డిటర్జెంట్స్, బేకరీ ఫుడ్ ఐటమ్స్, టైలరింగ్, అగరబత్తీలు తయారు చేస్తున్నారని హోంమంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాస్, కలెక్టర్ హరి కిరణ్, జైళ్ల శాఖ డీజీ మొహమ్మద్ అషన్ రజా, ఎస్ పీ అన్బురాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.