YCP MLC: పార్టీ ఫిరాయించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సీ రామచంద్ర యాదవ్ లపై వేటు వేసినట్లు ప్రకటించారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీకృష్ణ యాదవ్ స్థానిక సంస్థల కోటా నుండి, సీ రామచంద్రయ్య గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. సీ రామచంద్రయ్య టీడీపీ గూటికి చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వారిద్దరి నుండి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. ఈ క్రమంలో సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
ఇటీవలే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నుండి గెలిచి వైసీపీకి చేరిన నలుగురు ఎమ్మెల్యేలు, వైసీపీ నుండి విజయం సాధించి టీడీపీ లో చేరిన నలుగురు మొత్తం 8 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. తాజాగా శాసనమండలి చైర్మన్ కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకున్నారు.
CAA: మోడీ సర్కార్ కీలక నిర్ణయం ..సీఏఏ నోటిఫికేషన్ జారీ