RK Roja: ఏపీ పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి మంత్రి ఆర్కే రోజా ఇవేళ డప్పు కొట్టి కళాకారులను ఉత్తేజపరిచారు. రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి (భాషా సంస్కృతిక శాఖ) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ రంగాల కళాకారులు పాల్గొనగా, ముఖ్య అతిధిగా హజరైన మంత్రి ఆర్కే రోజా కొద్దిసేపు డప్పు కొట్టి నవ్వులు పూయించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. సాంస్కృతిక సంబరాల్లో కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. తోటి కళాకారులందరికీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
నవరత్నాలు పథకాల ద్వారా కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేకూర్చిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదనీ, గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. కళాకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వం పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కళాకారులే బాధ్యతగా తిప్పికొట్టాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, రాష్ట్ర సృతనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ ఎల్ జోగినాయుడు, సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, దృశ్య కళల అకాడమి చైర్ పర్సన్ కే సత్య శైలజ, సాహిత్య అకాడమి చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య కళల అకాడమి చైర్ పర్సన్ పి శిరీష. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి చైర్ పర్సన్ టి ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యుడు మస్తానమ్మ, రాష్ట్ర సంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జునరావు పాల్గొన్నారు.
AP Politics: అన్నా- చెల్లి, మరిది – వదిన – ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం