AP Politics: ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కుటుంబాల చేతిలో ఉన్నాయి. ఈ తరహా రాజకీయ పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని చెప్పవచ్చు. వైసీపీ అధినేత గా సీఎం వైఎస్ జగన్ ఉండగా, ఆయన సోదరి (చెల్లి) వైఎస్ షర్మిల .. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైయ్యారు. రేపు పీసీసీ పగ్గాలు చేపడుతున్నారు.
మరో పక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అధినేతగా ఉండగా, ఆయన వదిన (సతీమణి భువనేశ్వరి సోదరి) దగ్గుబాటి పురందేశ్వరి మరో జాతీయ పార్టీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంతకు ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.
వీరి హయాంలోనూ పార్టీ పరిస్థితి మెరుగపడకపోవడంతో చివరకు చంద్రబాబు బంధువు అయినప్పటికీ చాలాకాలంగా వారి మధ్య రాజకీయ, కుటుంబ వైరం కూడా ఉండటంతో దగ్గుబాటి పురందేశ్వరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది బీజేపీ. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ సీఎం జగన్ ను వ్యతిరేకిస్తూ పార్టీలో చేరిన ఆయన సోదరి వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది.
రెండు జాతీయ పార్టీలకు మహిళా నేతలు అధ్యక్షులుగా ఉండటం ఒక ఎత్తు అయితే .. వీరు ఇద్దరు కూడా ప్రాంతీయ పార్టీల అధినేతలకు దగ్గరి బంధువులు కావడం మరో విశేషం. రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండటం ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇటువంటి రాజకీయ దృశ్యం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదు. చాలా రాష్ట్రాల్లో కుటుంబ సభ్యుల్లో అభిప్రాయ బేధాల కారణంగా వేరు వేరు పార్టీ ఉండటం రివాజే. కానీ .. రాష్ట్రంలో పార్టీలకు నాయకత్వం వహించేవారే దగ్గరి బంధువులు కావడం, రాజకీయంగా తలబడుతుండటం విశేషం.
Kesineni Nani: టీడీపీ 60 శాతం ఖాళీ అవ్వడం ఖాయమని పునరుద్ఘాటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని