APTF: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆశలు వమ్ము చేసేలా ఏపి జేఏసీ నాయకత్వం అప్రజాస్వామిక మోసపూరిత వైఖరి అవలంబించిందని ఆరోపిస్తూ ఏపీటీఏఫ్ (ఉపాధ్యాయ సంఘం) నేతలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఏపి జేఏసీ కో చైర్మన్ పదవి, కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏపీటీఏఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే భానుమూర్తి, పి పాండురంగ వరప్రసాదరావులు ప్రకటించారు. ఈ మేరకు వీరు ఏపిజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావుకు లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పీఆర్సీ ఉద్యోగులకు ఇప్పించడంలో విఫలం అయినందున ఏపి జేఏసీ ఆధ్వర్యంలో తొలుత రెండు జేఏసిల కలయిక, ఆ తరువాత నాలుగు జేఏసిల కలయిక ఉద్యోగుల్లో గొప్ప ఆశలు రేకెత్తించాయన్నారు.
APTF: ఎలాంటి ఫలితాలు రాకుండానే
జేఏసీ ఏర్పడిన నాటి నుండి ఏపీటిఎఫ్ జేఏసీలో భాగస్వామిగా ఉందన్నారు. స్టీరింగ్ కమిటీలో ఏపీటీఎఫ్ కు చోటు ఇవ్వకపోయినా ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా జేఏసిలో కొనసాగామన్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో నాయకత్వం ప్రదర్శించిన తీరు, ఎలాంటి ఫలితాలు రాకుండానే ఉద్యమాన్ని విరమించడం, ఈ ఉద్యమ కాలంలో నాయకత్వం ప్రభుత్వాన్ని విమర్శించిన మాటలకు ఆవేదన వ్యక్తం చేయడం వంటి చర్యలను వీరు తీవ్రంగా ఖండించారు.
జన బలం ఉన్న నాయకత్వం ప్రభుత్వానికి ఉద్యమాన్ని తాకట్టు పెట్టినట్లుగా భావిస్తున్నామన్నారు. ఉద్యోగుల డిమాండ్లు ఏవీ పరిష్కారం కాకుండానే సమ్మె విరమణకు నిర్ణయం తీసుకోవడం గానీ సమ్మె విరమణ ప్రకటన చేసే ముందు ఏపి జేేేఏసీలోని భాగస్వామ్య సంఘాలతో కనీసం చర్చించలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులమైన తాము జేఏసీలో కో చైర్మన్ గా, కార్యవర్గ సభ్యులుగా కొనసాగడంలో ఎలాంటి అర్ధం లేదని కావున తమ పదవులకు రాజీనామా చేస్తూ, భవిష్యత్తు ఉద్యమాల కోసం జేఏసిలో కొనసాగుతామని తెలియజేశారు.