Assembly segments: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విభజన చట్టం తీసుకువచ్చారు. ఆ విభజన చట్టంలో అనేక హామీలను కేంద్రం ఇచ్చింది. అందులో ప్రధానమైనది ఏపికి ప్రత్యేక హోదా. ఆ తరువాత రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా. అదే విధంగా రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి అనుమతులు ఇవ్వడం వంటి వాటితో పాటు మరో ముఖ్యమైనది రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంపు అంశం ఉంది. ఇవన్నీ కూడా చట్టబద్దంగా కేంద్రం ఇచ్చిన హామీలు. అయితే ఈ చట్టంలో కొన్ని అమలు అయ్యాయి. కొన్ని అమలు కాలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దానికి అనేక కారణాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు జరగలేదు. 2014 నుండి 2019లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపిలో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చాలా లాబీయింగ్ జరిగింది. తీవ్ర ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న భావనతోనే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఎన్నికల సమయానికల్లా అసెంబ్లీ సీట్లు పెరగకలేదు. 2027 వరకూ అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Assembly segments: కేసిఆర్ ఘాటు లేఖతో తెరపైకి అసెంబ్లీ సీట్ల పెంపు అంశం
అయితే ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సీట్ల పెంపు అంశం తెరమీదకు వచ్చింది. ఏపి సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై మాట్లాడటం లేదు కానీ తెలంగాణ సీఎం కేసిఆర్ కేంద్రానికి లేఖరాశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ స్థానాలు పెంచాలంటూ కేంద్రానికి సీఎం కేసిఆర్ ఘాటుగా లేఖ రాశారు. దీనిపై కేంద్రం స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తామని కూడా పేర్కొన్నారు. ఒక వేళ కేంద్రం కేసిఆర్ లేఖకు స్పందిస్తే తెలంగాణతో పాటు ఏపిలోనూ అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా అవి 153 వరకూ పెరిగే అవకాశం ఉంది. అలానే ఏపి విషయానికి వస్తే ప్రస్తుతం 175 స్థానాలు ఉండగా అవి 229 స్థానాల వరకూ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్రం ఒప్పుకుంటే కొత్తగా ఏపిలో 54 స్థానాలు వస్తాయి.
జనగణన పూర్తి అయితేనే..
ఇదే జరిగే నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాలు మారతాయి. అసెంబ్లీ సీట్ల పెంపునకు ఓ చిన్న అడ్డంకి కనబడుతోంది. అసెంబ్లీ సీట్ల పెంపు చేయాలంటే జనగణన, కుల గణన పూర్తి కావాలి. అదే విధంగా ఎకనమిక్ సర్వే పూర్తి కావాలి. పదేళ్లకు ఒక సారి జరిగే జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. ఒక వేళ జనగణన పూర్తి అయినా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మార్చాలంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన 2008లో జరిగినందున మరల 2027లోనే చేస్తారని టాక్. ఏమి జరుగుతుందో వేచి చూడాలి. వడ్డించేవాడు మన వాడు అయితే బంతిలో చివరన ఉన్నా అన్నీ అందుతాయి అన్నట్లు కేంద్రం తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు.