AP Banks: బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవీ బ్యాంకు పని వేళలు!
ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి(ఏప్రిల్ 23,2021) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మే 15 వరకు ఈ రూల్స్ కొనసాగుతాయి. పరిమిత సిబ్బందితో బ్యాంకులు చేయాలని, పలువురు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా బ్యాంకర్ల సమితి తెలిపింది.
బ్యాంకు ఉద్యోగుల బాధలు అన్నీ ఇన్నీ కావు!
కస్టమర్లు ప్రతి సర్వీస్కు బ్యాంక్ బ్రాంచులకు వస్తున్నారని, దీని వల్ల కోవిడ్ 19 మరింత విస్తరించే అవకాశముందని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేంత వరకు పని వేళలు తగ్గించాలని కోరారు. రోజుకు 4 గంటలు మాత్రమే బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సగం సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు.ఇందుకు బ్యాంకర్ల సమితి ఆమోదం తెలిపింది .
తెలంగాణలో మరీ సీరియస్!
కాగా, కరోనా రెండో వేవ్లో తెలంగాణలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కోవిడ్ బారిన పడుతున్నారని ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.