తెలంగాణలో రెండోసారి కూడా బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కేసీఆర్ కి తిరుగులేకుండా పోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలన “నా మాటే శాసనం” అన్నస్థాయిలో సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇప్పట్లో మరోపార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే అనుకోవాలి. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి తెగ కష్టపడుతుంటాడు. కేసీఆర్ ప్రభుత్వం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేయడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని రేవంత్ వదులుకోరు! ఇప్పుడు ఇదే పని బీజేపీ కూడా చేయనాలోచిస్తుందట. అదేమిటంటే… కరోనా టెస్టుల విషయంలో హైకోర్టును ఆశ్రయించడం!
ఎంత ప్రయత్నించినా కేసీఆర్ ను రాజకీయ ఇబ్బందులు పెట్టలేని పరిస్థితులు నెలకొంటున్న దశలో… కరోనా పేరుచెప్పి కోర్ట్ ల ద్వారా ఇబ్బంది పెట్టే విధంగా టార్గెట్ చేసుకుని బిజెపి అడుగులు వేస్తోందనే చర్చ నడుస్తుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ జిల్లాలో కూడా కరోనా పరీక్షలకు సంబంధించి తెలంగాణాలో బిజెపి ఇప్పుడు హైకోర్ట్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయట. కరోనా పరీక్షలు లక్షణాలు ఉన్న వారికి చేయడం లేదని, టెస్టుల సంఖ్య పెంచడంలేదని హైకోర్ట్ లో బిజెపి పిటీషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ సహకారం కూడా తీసుకుంటోందన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో రేవంత్ రెడ్డి సహకారం కూడా తీసుకుని బిజెపి ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్లి హైకోర్ట్ లో పిటీషన్ వేసి, అనంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగి.. ఆ తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందట. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతలు కరోనా పరీక్షల విషయంలో అనేక రకాల విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో వారి ఆలోచనకు రేవంత్ రెడ్డి దూకుడు కూడా తోడయితే.. వ్యవహారం మరింత రక్తికట్టే సూచనలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.