రాజకీయాల్లో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు మాత్రమే ఉండాలి. మొహమాటాలు అస్సలు పనికిరావు. ఈ విష యం ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని పార్టీలు అనుసరిస్తున్న విధానమే. తెలంగాణలో మొహమాటాలకు పోయి.. కేసీఆర్ చేతులు కాల్చుకున్నారు. మూడో సారి ముచ్చటైన అధికారం దక్కుతుందని భావించి కూడా.. ఓడిపోయారు. ఇక, కేంద్రంలోని మోడీని చూస్తే.. ఆయనకు అస్సలు మొహమాటం లేదు. తాను ఎంపిక చేసేప్పుడే.. జాగ్రత్త పడతారు.. తేడా వస్తే.. పక్కన పెడతారు. ఇక, ఏపీలో సీఎం జగన్ కూడా ఇదే తరహా పరిస్థితిలో ముందుకు సాగుతున్నారు.
పార్టీ పరంగా.. నాయకుల పరంగా ఒత్తిడి వచ్చినా.. సీఎం జగన్ వెనక్కి తగ్గడం లేదు. గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. కానీ, ఎటొచ్చీ టీడీపీలో మాత్రం మొహమాటాలకు పొతున్న పరిస్థితి కని పిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లోనూ ఇదే తరహా మొహమాటాలకు పోయి.. చేతులు కాల్చుకున్నారు. అప్పట్లో కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా.. వారినే కొనసాగిం చారు. దీంతో టీడీపీ ఘోరంగా వెనుకబడింది.
ఇక, ఇప్పుడు కూడా టికెట్ల వ్యవహారంలో మొహమాటాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తునిలో యనమల కుటుంబం ఫేడ్ అవుట్ అయిపోయింది. కొన్నాళ్లుగా ఈ కటుంబం ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం లేదు. అయినా.. ఈ కుటుంబానికే టికెట్ ఇస్తున్నారు. యనమల దివ్య పేరు దాదాపు ఖరారు చేశారు. ఇక, ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం కూడా.. మొహమాటానికి కేంద్రంగా మారింది. పుట్టా సుధాకర్ యాదవ్ వరుసగా పరాజయం పాలవుతున్నారు. ఈసారీ ఆయనకే టికెట్ కేటాయించారని తెలిసింది.
విజయవాడ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ దఫా గెలుపు గుర్రం ఎక్కడం కష్టమనే వాదన సొంత పార్టీలోనే ఉంది. పైగా ఇక్కడ సమీకరణలు మారాయి. ఈ క్రమంలో అభ్యర్థిని మార్చి వేరే వారికి ఇస్తే.. కొంత బెటర్ అంటున్నారు. అయినా.. గద్దె వైపే పార్టీ నిలబడింది. దీంతో కమ్మ వర్గంలో చీలిక రానుందని తెలుస్తోంది. అదేవిధంగా తిరువూరులోనూ ఇదే ప్రయోగం చేస్తున్నారు. శ్యావల దేవదత్ను ముందు నియమించి.. ఇప్పుడు పొరుగు జిల్లాకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావుకు టికెట్ ఇస్తామని చెబుతున్నారు.
సో.. ఇవన్నీ.. కూడా ఏదో చేస్తున్నాం.. ఈక్వేషన్లు మారుస్తున్నామని చెబుతున్నా.. అంతర్గతంగా పార్టీలో నైరాశ్యం పెరిగేందుకు దారితీస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక చివరగా చంద్రబాబు ఈ సారి కూడా పార్టీకి చావో రేవో అయినప్పుడు కూడా మొహమాటాలకు పోతే జరిగేదేంటో తెలుసుగా అని పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు.