YS Sharmila: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జంపింగ్ లు కొనసాగుతున్నాయి. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇవేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ ఇద్దరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. వీరికి వైసీపీ టిక్కెట్ లు ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజులుగా పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే ఎలిజా ఇవేళ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిశారు. వైఎస్ షర్మిల ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎలిజా మీడియాతో మాట్లాడుతూ .. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తనను ఇబ్బందులకు గురి చేశారనీ, పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండానే రీజనల్ కోఆర్డినేటర్ సమావేశాలు పెట్టారని, ఈ విషయాన్ని చాలా సార్లు పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లినా సరైన స్పందన రాలేదని అన్నారు.
పార్టీకి నా అవసరం లేదేమోనని అనింపించి వైసీపీని వీడినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చింతలపూడి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉంటానని, షర్మిల తనకు టికెట్ హామీ ఇచ్చారని ఎలిజా అన్నారు.
BJP: బీజేపీలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ .. ఎంపీ టిక్కెట్ పై లభించిన హామీ..?