అమరావతి: నవరత్న పథకాల అమలునకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఏఏ రంగాలకు ఎన్ని నిధులు కేటాయించాలన్న అంశంపై జగన్ తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల్లో నవరత్నాల హామీ అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సూచించారు.
ప్రధానంగా ఫించన్ పెంపు, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరాకు నిధులు పెంచాలని జగన్ ఆదేశించారు.
రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా రుణాల మాఫీ, ఉద్యోగుల వేతనాల పెంపు, అమ్మఒడి పథకం, గృహ నిర్మాణానికి నిధులు అధికంగా కేటాయించాలని జగన్ అన్నారు.
ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజేయ్ కల్లం, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ, ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్, ఉన్నతాధికారులు, ఆయా శాఖల కార్యదర్శులు హజరైయ్యారు.
ఈ నెల 11వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో 2019-20 బడ్జెట్లో ఉండాల్సిన ప్రతిపాదనలపై ఈ సమీక్షలో చర్చించి జగన్ పలు సూచనలు చేశారు. .