Corona fear: ఇటీవల కరోనా బారిన పడివారిలో కొందరు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఆసుపత్రిలో నరక యాతన పడటం, కుటుంబ సభ్యులకు ఇబ్బందులు పెట్టడం ఎందుకని అనుకుంటున్నారో ఏమో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత నెలలో కరోనా బాధితులు ముగ్గురు నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా ఆసుపత్రి భవనం మీద నుండే దూకేసి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖ విమ్స్ ఆసుపత్రి వద్ద జరిగింది.
విశాఖ జిల్లా భీమునిపట్నం గొల్లపాలెంకు చెందిన మురిపాల వీరబాబు (37) కు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది. అయినా అతను ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆసుపత్రి భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. వీరబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ అతను ఎందుకు ఈ విధంగా చేశాడో అర్థం కాని పరిస్థితి. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More: Corona Vaccine: ఏపీ టీకాల్లో తిక్క తిక్క పనులు..! ఇదేమి లెక్క బాసూ..!?
జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కోవిడ్ కేర్ సెంటర్ లలో రోగుల మానసిక స్థైర్యాన్ని కల్పించేందుకు తగు చర్యలు, చైతన్య పరిచే కార్యక్రమాలను సైతం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా కరోనా సోకిన వారు ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా వారి పనులు వారే చేసుకుంటూ దాదాపు పది పదిహేను రోజులు ఉండాల్సి రావడం కొంత ఇబ్బందికర పరిస్థితే. ఒంటరితనం వల్ల సున్నిత స్వభావం కల్గిన వారు త్వరగా మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. కేంద్రాలలో ఇలా భయపడే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తే భవిష్యత్తులో ఇటువంటి బలవన్మరణాలు నిరోధించవచ్చు.