ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్గా తేలింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఆయన ఇటీవలే అమెరికా నుండి వచ్చారని మరియు అతనికి కరోనా లక్షణాలు ఉండడంతో ట్రూ నాట్ తోపాటు ఆర్డి ఆర్పి పరీక్షలు కూడా చేసినట్లు మరియు వాటిలో పాజిటివ్ అని ధ్రువీకరించినట్లు కూడా తెలిసింది. ఆయనతో పాటు అతని గన్ మెన్ కు కూడా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు చెబుతున్నారు.
అదే నిజమైతే ఏపీలో ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకడం ఇదే ప్రథమం అవుతుంది. ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇటీవలే తన వ్యక్తిగత పనినిమిత్తం అమెరికా వెళ్లి కొన్నాళ్లు అక్కడే ఉండి ఇటీవలే వచ్చారు. అనంతరం కొన్నాళ్లు ఐసోలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టుగా చెబుతున్నారు.
ఈ వార్త తెలిసి ఏపీ ఎమ్మెల్యేలు అందరూ కంగారు పడుతున్నారు. ఎందుకంటే గత వారమే అతను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం తో పాటు మూడు రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం కూడా జరిగింది. దీంతో ఈ విషయం అధికారికంగా బయటకు రాగానే అంతా క్వారంటైన్ కు వెళ్ళవలసి రావచ్చు.