ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రస్తుత పరిణామాలు అధికార యంత్రాంగానికి తీవ్ర తలనొప్పిగా మారుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంతో పాటు చట్టపరమైన ఇబ్బందులు ఏమి లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఎస్ఈసీ ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదనే పట్టుదలతో ప్రభుత్వం, వైసీపీ పెద్దలు ఉన్నారు. గతంలో జరిగిన పరిణామాలను చూపిస్తూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఏజంట్ అని, ఆయన ఎస్ఈసీగా ఉంటే ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగవు అని వైసీపీ మంత్రులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఈ తరుణంలోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించడం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి రమేష్ కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని ఎస్ఈసీకి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవనీ, అధికార యంత్రాంగం మొత్తం కరోనా విధుల్లో ఉన్నారనీ, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదనీ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయ, గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని కాదని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల విషయం ఇతర రాష్ట్రాలతో పోల్చడం కూడా సరికాదన్నట్లుగా కూడా లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనాతో 6,890 మంది మృతి చెందారనీ, రాబోయే రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం కూడా తెలిపిందని ఉటంకించారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని సూచించారు.
సీఎస్ లేఖపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఎస్ఎంఎస్ ద్వారా సీఎస్కు బదులు ఇచ్చారు. సీఎస్ ఈ విధంగా లేఖ రాయడం ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని అన్నారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను కించపర్చడమే అవుతుందని పేర్కొన్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క రాజ్యాంగ వ్యవస్థ (ఎస్ఈసీ) మధ్య జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.