AP Special Status: దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి, పలు రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవేళ డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ శివ మాట్లాడుతూ .. తమ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉన్నారనీ, సీఎం స్టాలిన్ రాగానే చర్చించి మద్దతు ఇస్తామని తెలిపారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలన్నారు. కొన్ని రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపించడం సరికాదని పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ హక్కుల కోసం కాంగ్రెస్ చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర విభజన హామీల కోసం ఈ రోజు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ లను కలిసినట్లు చెప్పారు. పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారన్నారు. కానీ ఇప్పటికీ ప్రత్యేక హోదాని ఇవ్వలేదు, హామీల అమలు చేయలేదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, రాజధాని నిర్మాణానికి సహకారం సహా కడప స్టీల్ ప్లాంట్ సహా ఏ హామీ అమలుకు నోచుకోలేదని షర్మిల విమర్శించారు. దుగరాజపట్నం పోర్ట్ ను నిర్లక్ష్యం చేశారని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదని చెపారు. హోదా కాదు కదా ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బుందేల్ ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు.
వైజాగ్ – చెన్నై కారిడార్ ను ఏర్పాటు చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. హామీలు అమలు చేయనప్పుడు బిజెపికి ఎందుకు ఏపీలో పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా కీలకమైన పది హామీల్లో ఒకటి అమలు కాలేదని అన్నారు. తమ పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. అన్ని పార్టీల నేతలు కలవడంతో పాటు అందరికీ లేఖలు రాస్తామని షర్మిల తెలిపారు.
YS Sharmila: శరద్ పవార్ తో వైఎస్ షర్మిల భేటీ .. ఆ కీలక అంశంపై వినతి పత్రం అందజేత