యూపీలో కాన్పూర్ కాల్పుల ఘటనలో 8 మంది పోలీసులను చంపాక గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అత్యంత నాటకీయ పరిణామాల నడుమ పోలీసులకు చిక్కాడు. మరుసటి రోజే అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఈ క్రమంలో కాల్పుల ఘటన నుంచి వికాస్ దూబే ఎన్కౌంటర్ వరకు అన్ని వార్తలూ సంచలనాలనే సృష్టించాయి. అయితే ఇప్పుడు వికాస్ దూబే చనిపోయాడు కానీ.. అతనితో సంబంధాలు ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రత్యేక బృందం విచారిస్తోంది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా వికాస్ దూబే ఆస్తులు, అతని సంపాదన వివరాలను ఆరా తీస్తోంది.
వికాస్ దూబే నెలకు దాదాపుగా రూ.90 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు సంపాదించే వాడని ఈడీ తెలిపింది. అయితే వికాస్ దూబేకు మద్యం సేవించే అలవాటు లేదు. అలాగే అతను నిరాడంబరంగా, అతి సాధారణ జీవితాన్నే గడిపేవాడు. మరోవైపు విదేశీ ప్రయాణాలు, విలాసాలకు కూడా పోయేవాడు కాదు. మరి అలాంటప్పుడు నెల నెలా సంపాదించే అంత డబ్బును అతను ఏం చేసేవాడని ఇప్పుడు ఈడీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇక వికాస్ దూబే సంపాదించన డబ్బు అంతా ఏమై ఉంటుంది ? అన్న కోణంలోనూ ఈడీ విచారణ జరుపుతోంది.
వికాస్ దూబేకు ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఎక్కడా ఎక్కువ డబ్బు లేదని ఈడీ గుర్తించింది. మరి అతను ఇన్ని సంవత్సరాల పాటు సంపాదించిన డబ్బు ఏమై ఉంటుంది ? అని ఈడీ అధికారులు షాక్కు గురవుతున్నారు. అయితే వికాస్ దూబే ఆ డబ్బును తనకు తెలిసిన వారు, సన్నిహితుల వద్ద దాచి ఉంటాడని తెలుస్తోంది. దీంతో ఈడీ ఇప్పుడు వికాస్ దూబే సన్నిహితుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తోంది. మరోవైపు వికాస్ దూబే తాను సంపాదించే డబ్బుతో ఏమైనా బిజినెస్లు చేసేవాడా ? అన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేస్తోంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎవరితో అయినా వికాస్ దూబే వ్యాపారాలను చేయించి ఉంటాడని ఈడీ అనుమానిస్తోంది. అందులో భాగంగానే ఈడీ విచారణ చేపట్టింది. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.