Second Wave: సెకండ్ వేవ్ Second Wave: కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్ లో ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. కరోనాతో మృతి చెందిన వారు ఎక్కువే.. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారూ ఎక్కువే. ఓదశలో కేంద్రం కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ప్రపంచదేశాలు స్పందించాయి. స్వచ్చంధ సంస్థలు స్పందించాయి. కొందరు స్వచ్చదంగా స్పందించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు అందజేశారు.. చిరంజీవి, సోనుసూద్ ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పిన విషయమూ తెలిసిందే. అయితే.. సెకండ్ వేవ్ మరణాల్లో డాక్టర్లు కూడా మృతి చెందడం విచారించదగ్గ విషయం. ఇంతటి విపత్తులో కూడా నిర్విరామంగా సేవలందించిన డాక్టర్ల మృతిపై మెడికల్ అసోసియేషన్ స్పందించింది.
ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన డాక్టలు ఈ మహమ్మారికి బలైపోవడం ఎంతో బాధాకరం. ఇప్పటివరకూ మొత్తంగా 594 మంది డాక్టర్లు మృతి చెందినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలపి ఈ సంఖ్యలో మరణించినట్టు వివరాలు సేకరించింది. అత్యధికంగా ఢిల్లీ వీరి మరణాల్లో ముందుంది. ఇక్కడ 108 మంది డాక్టర్లు కరోనా వల్ల మృతి చెందారు. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్-98, ఉత్తరప్రదేశ్-67 నిలిచాయి. ఆపై.. ఆరు రాష్ట్రాల్లో 25 నుంచి 50 మంది, రాజస్థాన్-43, ఝార్ఖండ్-39, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో 32 మంది చొప్పున, తమిళనాడు-21, మహారాష్ట్ర-17, మధ్యప్రదేశ్-16, ఆపై.. 12 రాష్ట్రాలు, ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకొక్కరు చొప్పున మరణించారు.
Read More:Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్..! నిన్న కర్ణాటకలో.. నేడు గుంటూరులో.. ప్రారంభం
ఈ సందర్భంగా ఐఎమ్ఏ స్పందించి. ‘డాక్టర్లు, సిబ్బందని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి కేంద్రం వ్యాక్సినేషన్ వేయించింది. అయితే.. ఆయాచోట్ల డాక్టర్లపై దాడులు జరిగాయి. ఆసుపత్రిలో రోగి మృతి చెందితే రోగి బంధువు దాడి చేశారు. ప్రాణాలకు తెగించి వైద్యులు చికిత్స అందించినా ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఇటువంటి దాడులను అరికట్టేందుకు కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలి. లేదంటే.. ఇటువంటి సంఘటనలు డాక్టర్లపై ఒత్తిడి పెంచుతాయి. అంత ఒత్తడి మధ్యలోనే వారూ పని చేయాల్సి వస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సి ఉంది’ అని ఓ ప్రకటనలో ఐఎమ్ఏ కోరింది.