Congress mp Shashi Tharoor: కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సుప్రీం కోర్టు కూడా వ్యాక్సిన్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపి శశిథరూర్ కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానాలను విమర్శించారు. ఏప్రిల్ నెలలో కరోనా బారిన పడిన శశిథరూర్ ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు. ఆయన కరోనా బెడ్ పై నుండే వీడియో సందేశాన్ని ఇచ్చారు. భారత్ ను కరోనా నుండి కాపాడండి.. అందరికీ వ్యాక్సిన్లు ఉచితంగా వేయండి అంటూ శశిథరూర్ సందేశం ఇచ్చారు.
తాను చాలా రోజుల నుండి కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్న శశిథరూర్ ..డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ వేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఆశ్చర్యం కల్గిస్తుందన్నారు. ఇప్పుడున్న కొరతతో డిసెంబర్ కల్లా కేంద్రం అందరికీ టీకాలను ఎలా ఇస్తుందా అని తనకు ఆశ్చర్యం వేస్తోందన్నారు. వ్యాక్సినేషన్ విధానాలను కేంద్రం మార్చేలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేరువేరు ధరల్లో వ్యాక్సిన్ లను సమకూర్చుకోవడాన్ని శశిథరూర్ తప్పుబట్టారు. అందరికీ టీకాలను ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు మధ్య ధరలతో పోటీ పెడతారా అని ప్రశ్నించారు.
Read More: Etela rajender: ఈటలను అభినందించిన విజయశాంతి..!ఎందుకంటే..?
తక్కువ ధరలకే కేంద్రం టీకాలను కొనే అవకాశం ఉన్నప్పుడు కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇవ్వవచ్చు కాదా అని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైయినప్పుడు ఉన్న విధానాలనే ఇప్పుడూ అమలు చేయాలని శశిథరూర్ డిమాండ్ చేశారు. తాను బాధపడినట్లే తన తోటి ప్రజలు బాధపడకుండా ఉండాలంటే అందరికీ టీకాలు ఉచితంగా ఇవ్వాలని అన్నారు. శశిథరూర్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోను గంటల వ్యవధిలో వేలాది మంది లైక్ లు ఇస్తూ రిట్వీట్ చేశారు.
My message from my Covid sickbed: #SpeakUpForFreeUniversalVaccination pic.twitter.com/JjKmV5Rk71
— Shashi Tharoor (@ShashiTharoor) June 2, 2021