Vaccine: కోవిడ్ వ్యాక్సిన్లపై విస్తు గొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి. కోవిషీల్డ్ టీకా తీసుకున్నా తన శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదనీ ఓ వ్యక్తి సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలాపైనే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టీకాలపై అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త వేరియంట్ల నుండి రక్షణ లభిస్తుందా లేదా అన్న విషయాలపైనా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో కరోనా సోకిన వారిలో టీకాలు సహజ రోగ నిరోధక శక్తిని పెంచుతాయని తేలిందట. కొత్తగా వచ్చే వేరియంట్ల నుండి కూడా వీరికి రక్షణ లభిస్తుందని తెలిసింది. కరోనా రోగి రక్తంలోని యాంటీబాడీలను విశ్లేషించిన తరువాత ఆమెరికాలోని రాక్ ఫెల్లర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అణువుల పరిణామాన్ని గుర్తించారు. కోవిడ్ కారక సార్స్ కోవ్ 2ను అడ్డుకోవడంలో రోగ నిరోధక వ్యవస్థ మెమరీ బీ కణాల నుండి ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలు చక్కగా ఉపయోగపడతాయని ఈ పరిశోదనల ద్వారా తెలిసింది.
వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో వైరస్ కు వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన రక్షణ వ్యవస్థ తయారు అవుతుందని పేర్కొన్నారు. మెమరీ బి కణాలు రోగ నిరోధక జలాశయంగా పని చేస్తాయట. మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ తీసుకున్న 26 మందిలో ఈ ప్రతిరోధకాలు ఆ తరువాత మరింత మెరుగుపడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వారిలో పెరిగిన ప్రతిరోధకాలు యుకే, దక్షిణాఫ్రికా, న్యూయార్క్ తదితర వేరియంట్లను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవని పరిశోధకులు గమనించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు వైరస్ బారిన పడిన వారికి కూడా అదనపు రక్షణను కల్పిస్తాయని ఈ అధ్యయనం ద్వారా తెలియజేశారు.