Supreme Court: రాజద్రోహం ఆరోపణలతో ఏపి సీఐడి అరెస్టు చేసిన వైసీపీ ఎంపి రఘురామ కృష్ణం రాజుకు సుప్రీం కోర్టు బెయిల్ అయితే ఇచ్చింది కానీ ఆయన ఊహించని షరతులు విధించింది. గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్న రఘురామ కృష్ణంరాజును ఇటీవల ఏపి సీఐడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఐడి విచారణలో ఉన్న సమయంలో ఆయన పాదాలకు గాయం కావడం, దానికి సీఐడీ అధికారులే హింసించారంటూ ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది.
దీనిపై రఘురామ తనయుడు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, సీఐడి కస్టడీలోనే గాయాలు అయ్యాయని పేర్కొనడంతో విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు వైద్య పరీక్షల నివేదికను సుప్రీం కోర్టు పరిశీలించింది. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల మద్య వాదనలు వాడివేడిగా జరిగాయి. అనంతరం రఘురామకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Supreme Court: రఘురామకు ఇవీ షరతులు..
మీడియా, సోషల్ మీడియా ముందు మాట్లాడకూడదు. ఎలాంటి వీడియోలు పోస్టు చేయకూడదు. ఇంతకు ముందులా కాళ్లు చేతులు చూపించే విన్యాసాలు చేయొద్దు. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. సీఐడీ విచారణకు పూర్తిగా సహకరించాలి. లక్ష పూచికత్తును ట్రయల్ కోర్టులో జమ చేయాలి.
రఘురామకు బెయిల్ రాగానే మళ్లీ మీడియా ముందుకు వచ్చి ఇంతకు ముందు కంటే రెచ్చిపోతారంటూ ఆయన వర్గీయులు భావించారు. అయితే సుప్రీం కోర్టు పలు షరతులు విధించడంతో బెయిల్ వచ్చిందన్న ఆనందం ఆయన వర్గీయుల్లో క్షణాల్లో ఆవిరి అయ్యింది.