కరోనా మహమ్మారి ఒక్కొక్కరిని ఎంతగా వణికిస్తుందో తెలిసిందే. రోజు రోజుకీ కరోనా విజృభిస్తోంది. అయితే ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు కరోనాతో బాధపడుతున్న వారి కోసం ప్లాస్మాను సేకరించేందుకు కూడా సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్లాస్మా దానంపై అవగాహణ కల్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదొక ప్రకృతి వైపరిత్యం. ఈ సమయంలో ప్లాస్మా దానం చేయడం అంటే.. ఇంకొకరికి ప్రాణం పోయడమే.. ఈ విషయాన్ని అందరికీ అవగాహణ కల్పిస్తూ ఇప్పటికే చాలా మందితో ప్లాస్మా దానం చేయించారు. ప్లాస్మా దాతలకు ప్రోత్సాహకంగా ఇటీవల చిరంజీవితో సన్మానం చేయించిన సజ్జనార్ ఈసారి దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణిలతో సన్మానం చేయించారు.
కరోనా బారిన పడ్డ రాజమౌళి కుటుంబం నెగటివ్ వచ్చిన వెంటనే ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్లాస్మా దానం చేసిన డోనర్స్ కు రాజమౌళి చేతుల మీదుగా సన్మానం చేయించారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి కీరవాణి తో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కీరవాణి పాడిన ప్లాస్మా దానం అవగాహణ పాటను కూడా ఆవిష్కరించారు. ప్లాస్మా దానం విషయంలో రాజమౌళి కుటుంబ సభ్యులు చూపిస్తున్న అసక్తిపై సీపీ అభినందనలు తెలియజేశారు.
అంతేకాదు ఈ సందర్బంగా రాజమౌళి, కీరవాణి కరోనాను జయించిన ప్రతి ఒక్కరు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక రాజమౌళి ..ఆయన కుటుంబ సభ్యులు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావడంతో అందరూ ఆయనకి సెల్యూట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ అన్న భారీ పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.