Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ కు షాకిచ్చింది అస్సాంలోని హిమంత్ బిశ్వ శర్మ సర్కార్. రాహుల్ సహా ఇతర నేతలపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
హింసాత్మక ఘటనలు రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కల్గించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, కన్హయ్య కుమార్ తదితరులపై 120(బీ), 143, 188, 283, 353, 332, 333, 427 ఐపీసీ, రెడ్ విత్ సెక్షన్. 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారని సీఎం బిశ్వ శర్మ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
కాంగ్రెస్ నేతల చర్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశామని గువాహటి పోలీస్ కమిషనర్ దిగంత బోరా సైతం వెల్లడించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనే వారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించొద్దని, అనుమతి ఉన్న మార్గంలోనే వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ నాయకులు రెచ్చగొట్టడంతో అనుమతి ఇచ్చిన మార్గంలో వెళ్లకుండా నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
బారికేడ్లను తోసుకుని ముందుకెళ్లాలని నాయకులే ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తలు రెచ్చపోయి పోలీసులపై దాడి చేశారనీ, ఈ దాడిలో నలుగురు సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. చట్ట విరుద్ద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ జీపీ సింగ్ తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఫైర్
భారత్ జోడో న్యాయ యాత్ర గువాహటి ప్రవేశించకుముందు అస్సాం – మేఘాలయ సరిహద్దులో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. అస్సాం సిఎంకు అమిత్ షా ఫోన్ చేసి తన యాత్రను అడ్డుకోవాలని ఆదేశించారని ఆరోపించారు.
తన యాత్ర వల్ల వాళ్ల గుండెల్లో భయం నెలకొందనీ, అందుకే తనపై కేసు నమోదు చేయాలని డీజీపీకి నేరుగా సీఎం ఆదేశించారన్నారు. తాము బారికేడ్లు మాత్రమే తొలగించామనీ, చట్టాన్ని మాత్రం ఎప్పటికి ఉల్లంఘించమని అన్నారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇదే మార్గంలో వెళ్లారని, ఇప్పుడు కాంగ్రెస్ కు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు.
భారత్ జోడో న్యాయ యాత్ర గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా మంగళవారం భారీగా బారికేడ్లను పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకువెళ్లారు. రాహుల్ కు స్వాగతం పలుకుతూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఖానాపారాలోని గువాహటి చౌక్ వద్దకు చేరుకున్నారు.
With reference to wanton acts of violence, provocation , damage to public property and assault on police personnel today by Cong members , a FIR has been registered against Rahul Gandhi, KC Venugopal , Kanhaiya Kumar and other individuals under section…
— Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024