న్యూ ఇయర్ మొదటి రోజే ఏపిలోని తూర్పు గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రి శారద నాగర్ లో స్క్రాప్ షెడ్ లో తారాజువ్వలు పడి అగ్ని ప్రమాదం సంభవించింది,. దీంతో నివాసాల మధ్య మంటలు ఎగిసి పడటంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. మంటలు ఎగిసి పడటంతో స్థానికులు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగ అలుముకోవడంతో మంటలను అదుపుచేయడం అగ్నిమాపక సిబ్బందికి తీవ్ర కష్టతరమైంది. పరిసర ప్రాంతాలు పొగతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తినష్టం జరిగింది అనేది ఇంకా వెల్లడి కాలేదు.