Jaya Prada: బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు ప్రకటించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రెండు కేసుల్లో ఆమెను అరెస్టు చేసి, మార్చి 6వ తేదీ లోపు తమ ముందు హజరుపర్చాల్సిందిగా మంగళవారం పోలీసులను కోర్టు ఆదేశించింది.
రామ్ పూర్ ఎంపీగా పని చేసిన జయప్రదపై 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జయప్రద సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజంఖాన్ చేతిలో పరాజయం పాలైయ్యారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసుల్లో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏడు సార్లు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యు) జారీ చేసినా ఆమె బేఖాతరు చేశారు. దీంతో సీరియస్ అయిన న్యాయస్థానం .. ఆమెను అరెస్టు చేసేందుకు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రాంపూర్ ఎస్పీని ఆదేశించింది. జయప్రదను అరెస్టు చేసి మార్చి 6వ తేదీలోపు తమ ముందు హాజరుపర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హిందీ, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ గా గుర్తింపు పొందిన జయప్రద.. 1994లో సినిమా రంగాన్ని వదిలి టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమె రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీ నేతలతో వచ్చిన విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్ధిగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
TDP: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా