(కడప నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవ దహనం కాగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కడప – తాడిపత్రి రహదారి మధ్యలో కడప ఎయిర్ పోర్టు సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం తెల్లవారుజామున జరిగింది
ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్న సుమోను తొలుత టిప్పర్ ఢీకొట్టింది. ఆ వెంటనే మరో కారు టిప్పర్ను డీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. సుమోను ఉన్న నలుగురు సజీవ దహనం అయ్యారు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శకటంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. పోలీసులు క్షతగాత్రులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సజీవ దహనం అయిన నలుగురు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మరో కారు కూడా స్మగ్లర్లదేనని సమాచారం. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారు అయ్యాయి. పోలీసులు.. క్షతగాత్రుల ద్వారా మృతుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు రాత్రి సమయాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది.