G 20 Summit: ఇండోనేషియా బాలిలో జరుగుతున్న 17వ జీ – 20 సమావేశాల్లో భారత ప్రధాని మోడీ బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆప్యాయంగా కౌగిలించుకుని ముచ్చటించారు. అనంతరం సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఆాహరం, ఇంధన భద్రత – ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కి ప్రధాని మోడీ అభివాదం చేసి కరచాలనం చేశారు. ఇవేళ తెల్లవారుజామున ప్రధాని మోడీకి వేదిక వద్ద ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో స్వాగతం పలికారు. సోమవారం రాత్రి బాలి చేరుకున్న ప్రధాని మోడీకి సంప్రదాయ స్వాగతం లభించింది.
ఈ రోజు, రేపు జరిగే సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారని సమాచారం. వచ్చే ఏడాది జీ – 20 సమ్మిట్ ఇండియాలో జరగనున్న నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడి నుండి భారత ప్రధాని మోడీ లాంఛన ప్రాయంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. డిసెంబర్ 1 నుండి జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనున్నది. 2023 సెప్టెంబర్ లో 18వ జీ 20 సమావేశాలకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. కాగా ఈ సదస్సు అనంతరం ప్రదాన మంత్రి మోడీ అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హజరుకానున్నారు.