విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పోటీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. భీమిలి నుంచి పోటీ చేసేందుకు గంటా ఉవ్విళూరుతుంటే.. చంద్రబాబు మాత్రం గంటాను చీపురుపల్లికే పంపించాలని భావిస్తున్నారు. దీంతో గంటా చీపురుపల్లి పరిస్థితులపై సమాచారాన్ని తెప్పించుకునే పనిలో పడ్డారు. ఉత్తరాంధ్రలో వైసీపీలో సీనియర్ నేతగా, విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బొత్సను ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ప్రస్తుతం చీపురుపల్లి ఇన్చార్జ్గా కిమిడి నాగార్జున ఉన్నారు. టికెట్పై ఆశలతో నాగార్జున జనాల్లోకి జోరుగా వెళుతున్నారు. కానీ, ఆర్థిక, అంగ బలం మెండుగా ఉన్న బొత్సను ఢీకొట్టాలంటే అంతటి బలమైన నేతను బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. విజయనగరం జిల్లాలో అంతటి బలమైన నేత లేకపోవడంతో చంద్రబాబు ఏరికోరి గంటాను అక్కడికి పంపించేం దుకు సిద్ధమయ్యారు. ఇద్దరి బలాబలాలను పరిశీలిస్తే.. విజయనగరం జిల్లా రాజకీయాలను బొత్స సత్యనారాయణ ఒక రకంగా శాసిస్తున్నారనే చెప్పాలి.
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఉన్నా.. తన పని తాను చేసుకోవడమే తప్ప రాజకీయంగా బొత్స కుటుంబాన్ని ఎదిరించే తత్వం ఆయనది కాదు. మిగిలిన నేతలంతా నియోజకవర్గాలకు పరిమితమైన వారే. జిల్లా రాజకీయాలను శాసించేంత సామర్థ్యం వారికి లేదు. ఈ నేపథ్యంలోనే పొరుగు జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావును బరిలోకి దించడం ద్వారా రానున్న రోజుల్లో విజయనగరం జిల్లాలో బొత్సకు చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బొత్సకు పోటీగా గంటాను పంపిస్తున్నారు.
బొత్సపై విజయం సాధిస్తే.. భవిష్యత్లో విజయనగరం జిల్లా రాజకీయాలను పూర్తిగా శాసించే అవకాశం గంటాకు దక్కుతుంది. చంద్రబాబు లెక్కలు ఇలా ఉంటే.. గంటా మాత్రం మరోలా లెక్కలు వేసుకుని అక్కడకు వెళ్లేందుకు సాహసం చేయడం లేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సకు బలమైన అనుచర గణం ఉంది. చీపురుపల్లి నుంచి సిటింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఇక్కడే ఎక్కువగా రాజకీయాలు నెరుపుతుంటారు. ముఖ్యమైన నేతలంతా ఇక్కడే వైసీపీకి ఉండడంతో వారిని ఎదురొడ్డి బొత్సను ఓడించడం సాధారణ విషయం కాదన్న భావనతో ఉన్న గంటా.. అక్కడికి వెళ్లేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు.
చీపురుపల్లికి వెళ్లి పోటీ చేయాలని అధిష్టానం పదే పదే చెబుతుండడంతో క్షేత్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులను తెలుసుకో వడంపై గంటా దృష్టి సారించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంతోపాటు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడి స్థానిక పరిస్థితులు, పార్టీ బలం, బలహీనతలు వంటి అంశాలపై ఒక లెక్కకు వచ్చారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ను తెలుసుకునే ఉద్ధేశంతో సర్వే బృందాన్ని అక్కడికి పంపించినట్టు తెలిసింది. ప్రస్తుతం గంటాకు చెందిన టీమ్ అక్కడి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు.