కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపుగా 3 నెలల నుంచి మూత పడ్డ గోవా పర్యాటకం ఇప్పుడు టూరిస్టులకు మళ్లీ ఆహ్వానం పలుకుతోంది. దేశీయ పర్యాటకులు గోవాలో ప్రవేశించేందుకు మళ్లీ అనుమతులు ఇస్తున్నామని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గౌంకర్ తెలిపారు. ఈ క్రమంలోనే గోవాలో టూరిస్టుల కోసం 250 హోటళ్లను తెరుస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ లాక్డౌన్ కారణంగా గోవాలో పర్యాటకం నిలిచిపోయింది. ఆదాయం కోసం ప్రధానంగా ఆ రంగంపైనే ఆధారపడ్డ ఆ రాష్ట్రానికి ఇకపై మళ్లీ ఆదాయం రానుంది.
అయితే గోవాకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అక్కడి టూరిస్టు ప్రదేశాల్లో విహరించాలంటే పలు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
1. కోవిడ్ 19 తమకు లేదు అని నిర్దారించే సర్టిఫికెట్తో పర్యాటకులు గోవాలో 48 గంటల పాటు విహరించవచ్చు. లేదా ఆ రాష్ట్రంలోనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ పొందవచ్చు. అవి ఉన్నవారినే అక్కడ తిరిగేందుకు అనుమతిస్తారు.
2. టూరిస్టులను వారు బుక్ చేసుకున్న హోటల్స్కు ముందుగా పంపిస్తారు. అక్కడ వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. కోవిడ్ పరీక్షలకు పంపుతారు. ఆ ఫలితాలు వచ్చాకే వారు హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కోవిడ్ నెగెటివ్ వచ్చిన వారినే బయట తిరిగేందుకు అనుమతిస్తారు.
3. పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి రెండు ఆప్షన్లు ఇస్తారు. వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లి కోవిడ్ చికిత్స తీసుకోవచ్చు. లేదా గోవాలోనే ఉండి కోవిడ్ చికిత్స తీసుకోవచ్చు.
4. కేవలం టూరిజం శాఖ అనుమతి ఉన్న హోటల్స్లో మాత్రమే పర్యాటకులు రూమ్లను బుక్ చేసుకోవాలి. రూమ్లను ముందస్తు అడ్వాన్సు చెల్లించి మాత్రమే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు రూమ్లను అద్దెకు ఇవ్వరు.
5. ప్రభుత్వ అనుమతి లేకుండా హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఎంటర్టైన్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
6. అనుమతి లేని హోటల్స్, రెస్టారెంట్లలో పర్యాటకులు ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
ఇక గోవాలో ప్రస్తుతం కేవలం ఎంపిక చేసిన బీచ్లలోకి మాత్రమే పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఆ వివరాలను పర్యాటకులు ముందుగా తెలుసుకుని బీచ్లకు వెళ్లవచ్చు.