Gujarat Elections 2022: అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జై నారాయణ్ వ్యాస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయన అహ్మదాబాద్ లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను కలిశారు. రాజస్థాన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన దృవీకరించారు. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా బీజేపీలో ఉన్న జై నారాయణ్ వ్యాస్.. 2007 లో గుజరాత్ శాసన సభకు ఎన్నికై నరేంద్ర మోడీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి (ఆరోగ్య )గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ పై అసంతృప్తితో ఆయన అమ్ ఆద్మీ పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు వచ్చాయి కానీ నిర్ధారణ జరగలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా, అమ్ ఆద్మీ పార్టీలో చేరతారా అనేది ఇంకా వెల్లడించలేదు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ ఇప్పటికే విడుదల అయ్యింది. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1న మొదటి దశ పోలింగ్, డిసెంబర్ 5న రెండవ దశ పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. గత 27 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల వరకూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే గుజరాత్ లో ప్రధాన పోటీ ఉండగా, ఈ సారి రాష్ట్రంలో అమ్ అద్మీ పార్టీ బలపడింది. దీంతో త్రిముఖ పోరు జరగనుంది.
మరో పక్క కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు 43 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భుపేంద్ర పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఘట్లోడియా నియోజకవర్గం నుండి ఆయనకు ప్రత్యేకర్ధిగా రాజ్యసభ ఎంపీ అమీ యాగ్నిక్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్. వడోధర లోని సయాజిగంజ్ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు నరేంద్ర రావత్ సతీమణి అయిన వడోదర మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిపక్ష నాయకురాలు అమీ రావత్ ను ఎంపిక చేసింది కాంగ్రెస్.