టీఆర్ఎస్ లీడర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు బీజేపీ బుగులు పట్టుకుంది. తమ అనుచరులు ఎప్పుడు ఎక్కడ బీజేపీలోకి జంప్ అవుతారోనని కలవరపడుతున్నారు.
పార్టీ మారకుండా అనుచరులను, లోకల్ లీడర్లను సముదాయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరిని బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటుంటే, మరికొందరికి తాయిలాలు ఇచ్చి మనసు మారుస్తున్నారు. గతంలో అపాయింట్మెంట్ ఇవ్వని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత లోకల్ లీడర్లకు ఫోన్లు చేసి మంచీచెడులు తెలుసుకుంటున్నారు. ‘‘తమ్మీ..! పార్టీ మారకుండ్రి. మీకు మేమున్నం. త్వరలోనే నామినేటెడ్ పదవులు వస్తయ్. అన్ని రకాలుగా మిమ్మల్ని మేం చూసుకుంటం” అని భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బుజ్జగింపులకు తాత్కాలికంగా కొందరు ఓకే చెప్తున్నారు. అయితే.. అట్ల ఓకే చెప్పిన వాళ్లు కూడా సమయం చూసుకొని జంప్ అయ్యే ప్రమాదం ఉందన్న భయం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కుమార్తెకే ఝలక్
ఇటీవల నిజామాబాద్ రూరల్ జిల్లా ఎంపీటీసీలు, సర్పంచ్లు మూకుమ్మడిగా బీజేపీలో చేరడం వారిని వెంటాడుతోంది.ఈ మధ్యే నిజాబామాద్ జిల్లా లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకే స్థానిక టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచ్లు ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జిల్లా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను కవిత పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లోని డిచ్ పల్లి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు మూకుమ్మడిగా టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరంతా ఢిల్లీకి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ను కలిసి బీజేపీలో చేరడంతో కవిత షాక్కు గురైనట్టు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవహారంపై ఆమె లోకల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలిసింది.
మంత్రులకూ మనశ్శాంతి లేదు!
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తమ్ముడు ప్రదీప్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమైన్నట్టు వరంగల్ జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ్ముడు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తే తన పరువు పోతుందన్న బెంగ మంత్రి ఎర్రబెల్లిలో కనిపిస్తోందని, తమ్ముడ్ని బుజ్జగించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని లోకల్ లీడర్లు అంటున్నారు. అందుకే ఈ మధ్య ఎర్రబెల్లి మిగతా మంత్రుల కన్నా ఎక్కువగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని వరంగల్కు చెందిన ఓ ఎమ్మెల్యే అన్నారు.కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్ బీజేపీలో చేరడంతో మంత్రి గంగుల కమలాకర్ అలర్ట్ అయ్యారు. తన నియోజకవర్గం నుంచి పార్టీ మారే ఆలోచనలో ఉన్న లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి నచ్చచెప్తూ, టీఆర్ఎస్ లో ఉంటే లభించే రాజకీయ ప్రయోజనాలు వివరిస్తున్నారు.ఖమ్మం సిటీలో బీజేపీ బలం పుంజుకోవడం, ఇటీవల బీజేపీ నేతలు ఖమ్మంలో పర్యటించడంతో ఆ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కి టెన్షన్ పట్టుకుందని లోకల్ లీడర్లు చర్చించుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ లో
ఆ రెండు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి!
త్వరలో వరంగల్, ఖమ్మం మున్సిపల్
కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ఎక్కువగా టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలు పార్టీ మారే చాన్స్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు…