జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు అప్పుడే సిద్ధం అయిపోతున్నారు. అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని మినహాయిస్తే.. 24 పార్లమెంటు.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కరోజులో అభ్యర్థులను ప్రకటించేశారు. త్వరలోనే బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం అంతటా ఎన్నికల ప్రచారాన్ని మోగించనున్నారు. ఇక వైసీపీ మేనిఫెస్టో విడుదల కావడం ఒక్కటే మిగిలి ఉంది. గతంలో నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు. తాజాగా జగన్ చెప్పాడు అంటే చేస్తాడంతే.. అన్న నినాదంతో రాష్ట్రం అంతటా వైసీపీ ప్రచారం హోరెత్తుతుంది.
అందుకే 2024 ఎన్నికలు మేనిఫెస్టోకు సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ప్రధానంగా రైతులు, మహిళలకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలా వైసీపీ కొత్త మేనిఫెస్టోపై ఆలోచన కసరత్తు జరుగుతున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికలలో జగన్ మహిళలకు విడతల వారీగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా జగన్ రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6000 కలిపారు. ఆ తర్వాత ఇచ్చిన హామీ కంటే మరో వెయ్యి పెంచి ఇస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు.
అయితే ఈసారి జగన్కు గెలుపు అంత ఈజీ అయితే కాదు. అటు ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటయ్యాయి. ఇటు జగన్ ఒక్కడే ఒక వైపు అటు బీజేపి, పవన్ జనసేన, టీడీపీ అన్ని ఒకవైపు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా జగన్ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారు. ఇంకా చెప్పాలంటే జగన్ ఇవ్వని హామీలు కూడా చేసి చూపించారు. అయితే ఇప్పుడు జగన్ ఒకే ఒక పని చేస్తే మరోసారి సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్న చర్చ జరుగుతుంది. అదే రైతు రుణమాఫీ. రైతులకు కనీసం లక్ష రూపాయలైనా రుణమాఫీ చేయాలని అధికార పార్టీ అభ్యర్థుల నుంచి జగన్ పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ దిశగా అడుగులు వేసేందుకు బ్యాంకు అధికారులు.. ఆర్థిక నిపుణులతో.. జగన్ పలు విడతలుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలు వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో.. మరోసారి అధికారంలోకి రావాలంటే రైతు రుణమాఫీ తప్పదని.. జగన్కు పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారట. అయితే చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 ఎన్నికలలో చంద్రబాబు పూర్తిగా రుణమాఫీ చేస్తానని ప్రచారం చేసి గెలిచారు.
అధికారంలోకి వచ్చాక ఆ రుణమాఫీ సరిగా చేయలేకపోయారు. ఏడాదికి కేవలం 25వేలు చేస్తూ వెళ్లారు. అప్పటికే చంద్రబాబును నమ్మి అప్పులు కట్టని రైతులు అందరూ వడ్డీల ఊబిలో కూరుకుపోయారు. అయితే జగన్ ఏం చెప్పినా చేస్తాడని నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే ఇప్పుడు రైతు రుణమాఫీ హామీని ఎన్నికల ప్రధాన అస్త్రంగా వాడాలని వైసీపీ వాళ్లు జగన్ పై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.