ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ జనాలు వరుసగా రెండు ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించారు. 2014 – 2018 సాధారణ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్.. అధికారం లేక 10 ఏళ్లపాటు అల్లాడిపోయింది. ఎట్టకేలకు చేతికి పవర్ వచ్చిన తర్వాత.. తమ పాత వాసనలను కాంగ్రెస్ బయటపెడుతోంది. కెసిఆర్ సర్కారులో మంత్రులు డమ్మీలుగా ఉన్నారు. వారి కంటూ ఎలాంటి అధికారాలు లేవు. చివరికి వారి శాఖకు సంబంధించిన సమీక్ష సైతం వారు చేసుకునే స్వేచ్ఛ ఉండేది కాదు.
అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి సర్కారులో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల నామినేటెడ్ పదవులు పంపిణీ కార్యక్రమానికి తెర తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారం తన క్యాబినెట్లో ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రాజేసినట్టుగా చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు రేవంత్ కొన్ని కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. అయితే ఈ పదవుల పంపిణీలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్రుగా ఉన్నారు. ఈ జిల్లాకే చెందిన మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సన్నిహితులకే పదవులు అన్ని దక్కుతున్నాయని.. జిల్లాలో ఆయన మాటే చెల్లుబాటి అవుతుంది తప్పించి.. తనను పట్టించుకున్న వారు లేరనే పొన్నం అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద, కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకంపై పొన్నం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. తన సొంత జిల్లాకు చెందిన అంశాలను కూడా తనతో మాట్లాడకుండా.. తన అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ పై ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి – రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దీపా దాస్ మున్షి వద్ద పొన్నం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఈ మొత్తం ఎపిసోడ్లో పొన్నంను పక్కన పెట్టేసి మరో మంత్రి శ్రీధర్ బాబు అనుకూల వర్గానికి పెద్ద పీట వేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సుడా చైర్మన్ పదవి పొందిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించే ప్రయత్నం చేశారని.. అలాంటి వ్యక్తికి ఇప్పుడు నామినేటెడ్ పదవి ఎలా ? కట్టబెడతారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవులు పొందిన వారంతా మరో మంత్రి శ్రీధర్ బాబుకు సన్నిహితులు కావడం కూడా పొన్నంకు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందో లేదో అప్పుడే ఏకంగా మంత్రుల మధ్య ముసలం మొదలయింది.