Paytm: పేటీఎంకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పేటీఎం బ్యాంక్ కు మనీలాండరింగ్ కు సంబంధించి ఆరోపణలపై ఈడీ నోటీసులు జారీ చేయడం, కొద్ది రోజుల క్రితం పేటీఎం పేమంట్స్ పై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించడం తెలిసిందే.
తాజాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తరపున టోల్ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) .. ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుండి పీటీఎం పేమంట్స్ బ్యాంక్ ను తొలగించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించడం కోసం తాము పేర్కొన్న బ్యాంక్స్ నుండి ఫాస్టాగ్స్ కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది.
ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న బ్యాంకుల జాబితాలో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ తదితర మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. వీటిల్లో పేటిఎం బ్యాంక్ లేదు.
ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టగ్స్ లో డిపాజిట్లు సహా టాప్ అప్స్ స్వీకరించవద్దని పేటీఎం బ్యాంకును ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. సదరు ఖాతాల్లో ఇప్పటి వరకూ ఉన్న సొమ్మును మాత్రం అది అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ డిపాజిట్లు చేసుకునేందుకు వీల్లేదని ఆర్బీఐ తెలిపింది.
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఐహెచ్ఎంసీఎల్ ఈ మార్పులను చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం పేటిఎం బ్యాంకు కస్టమర్ల కేవీసీకి సంబంధించి నిబంధనలు పాటించలేదన్న కారణంగా ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లంతా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఐహెచ్ఎంసీఎల్ ఆదేశించింది.