ప్రముఖ సోషల్ మీడియా అప్లికేషన్ ఇంస్టాగ్రామ్ తమ వినియోగదారులకు భారీ షాక్ ఇవ్వబోతోంది. ప్రపంచంలోనే దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ కి చెందిన ఈ ఫోటో-వీడియో షేరింగ్ యాప్ తమ యూజర్స్ కి ఎలాంటి షాక్ ఇస్తోంది అని అనుకుంటున్నారా..? ఇక మీదట ఫోటోతో పాటు కింద ఒక క్యాప్షన్ రాస్తూ దాంట్లో యుఆర్ఎల్ పోస్ట్ చేయాలంటే వినియోగదారులు ఇంస్టాగ్రామ్ కు కొంత ఫీజు చెల్లించాలి.
దీనికోసం ఇంస్టాగ్రామ్ మాతృసంస్థ అయిన ఫేస్బుక్ దీనికి సంబంధించిన పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై యూజర్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పదివేలకు పైనే ఫాలోవర్స్ కలిగిన…. లేదా వెరిఫైడ్ మార్క్ ఉన్న అకౌంట్స్ కి మాత్రమే ఉచితంగా దీనికి అనుమతి ఉండేది. అయితే తాజా నిర్ణయంతో ఫోటో క్యాప్షన్ తో పాటు క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేలా యు ఆర్ ఎల్ పోస్ట్ చేయాలంటే యూజర్ రెండు డాలర్ల ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
అంటే కనీసం 150 రూపాయలు అయినా చెల్లించాలి. ఇక ఈ ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న వారు ఎవరైనా తమ కంటెంట్ ను ప్రమోట్ చేసుకునే వీలు ఉంటుంది. ఒకవేళ ఫీజు చెల్లించకుండా లింక్ పోస్ట్ చేసినట్లయితే యాప్ దానిని వెంటనే గుర్తించి లింక్ ను తొలగిస్తుంది. అయితే ఇది వ్యాపారపరంగా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవాలనుకునే వారికి మాత్రమే కానీ సాధారణ వినియోగదారులకు కాదని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ ఫీచర్ ఎప్పటి నుండి అమలులోకి రానుందో కంపెనీ నుండి స్పష్టమైన సమాచారం లేదు. కానీ ఈ కొత్త విధానం వల్ల ఎంతో మంది వినియోగదారులు ఇబ్బంది పడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.