వైసీపీలో సీనియర్ లీడర్, బలమైన నేత, బీసీ వర్గాలకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆలోచన ఇప్పుడు వైసీపీలోనే చాలా మందికి మింగుడు పడడం లేదు. మామూలుగానే బొత్స ఫ్యామిలీ రాజకీయంగా విజయనగరం జిల్లాను పూర్తిగా ఆక్రమించేసింది. చీపురుపల్లి నుంచి బొత్స రంగంలో ఉన్నారు. ఆయన సమీప బంధువు అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే. సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యే. మరో బంధువు చంద్రశేఖర్ విజయనగరం ఎంపీగా ఉన్నారు.
అటు ఎస్ కోట ఎమ్మెల్యే కూడా బొత్స ఫ్యామిలీ మెంబరే అంటారు. ఇక ఇప్పుడు బొత్స ఫ్యామిలీ రాజకీయాలు విజయనగరం నుంచి పక్కనే ఉన్న విశాఖకు కూడా పాకేస్తున్నాయి. ఎస్. కోట విశాఖ పార్లమెంటు పరిధిలో ఉంది. అక్కడ ఎలాగూ బొత్స బంధువే పోటీలో ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బొత్స భార్య ఝాన్సీ లక్ష్మి విశాఖ నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీలో ఉంటున్నారు. ఇక బొత్స మేనల్లుడికే విజయనగరం ఎంపీ టిక్కెట్ దక్కనుందని అంటున్నారు.
అసలు ఏపీలో అధికార వైసీపీలో మహామహాలు అయిన వారినే జగన్ పక్కన పెట్టేస్తున్నారు. అలాంటిది జగన్ ఏకంగా బొత్స ఫ్యామిలీకి రెండు ఎంపీ టిక్కెట్లు ఇవ్వడం అంటే వాళ్లు గారెల బుట్టలో పడినట్టే అని వైసీపీ వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఒక్క బొత్స ఫ్యామిలీకే నాలుగు అసెంబ్లీ టిక్కెట్లతో పాటు రెండు ఎంపీ సీట్లు.. ఇక జిల్లాలో స్థానిక సంస్థల్లో చాలా మంది బొత్స బంధువులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.
అయితే బొత్స రాజకీయాన్ని విజయనగరం నుంచి పక్కనే ఉన్న విశాఖకు కూడా తీసుకు రావడంతో విశాఖ జిల్లాకు చెందిన చాలా మంది వైసీపీ వాళ్లకు అస్సలు ఇష్టం లేదు. బొత్సను విజయనగరం వరకు పరిమితం చేయాలని వారు కోరుతున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. తన భార్య విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండడంతో తాను చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేసినా ఉపయోగం ఉండదని.. తాను కూడా విశాఖ పార్లమెంటు పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తేనే తన భార్యకు కూడా ఉపయోగం ఉంటుందన్న నిర్ణయానికి బొత్స వచ్చేశారట.
ఈ క్రమంలోనే చీపురుపల్లి అసెంబ్లీ సీటును ప్రస్తుత విజయనగరం ఎంపీ చంద్రశేఖర్కు ఇచ్చేసి బొత్స విశాఖ పార్లమెంటు పరిధిలోని భీమిలి అసెంబ్లీ బరిలో ఉండాలని ప్రయత్నాలు మొదలు పెట్టేశారట. అదే జరిగితే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీను సీటుకు ఎర్త్ పెట్టేసినట్టే. అందుకే విశాఖ వైసీపీ లీడర్లు బొత్స విశాఖలో కాలు పెట్టడాన్నే ఒప్పుకోవడం లేదు.