ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు గుర్రాల కోసం ఆయన అన్వేషిస్తున్నారు. పలుచోట్ల కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు.. కొంతమందిని ఇతర నియోజకవర్గాలకు మారుస్తున్నారు. ఇప్పటికే 9 జాబితాలను విడుదల చేశారు. ఇక రాజమండ్రి పార్లమెంటు సీటు నుంచి టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వివి వినాయక్ పేరు వినిపించినా ఆయన పోటీలో ఉండనని చెప్పారు. ఇక టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు ఆలీని ఈసారి ఎన్నికల బరిలోకి దింపుతున్నారని టాక్ నడుస్తోంది.
ఆలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటు స్థానం బరిలోకి దింపవచ్చని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఆలీకి జగన్ సీటు ఖరారు చేశారని.. ఒకటి రెండు రోజులలో దీనిపై ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి ఆలీని గుంటూరు తూర్పు లేదా రాయలసీమలో మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని అనుకున్నారు. తీవ్ర చర్చల అనంతరం కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని జగన్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలీ నంద్యాల పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం.
గత ఎన్నికలకు ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత ఊరైన రాజమండ్రి నుంచి టికెట్ ఆశించారు. అది నెరవేరలేదు.. ఆలీకి గత ఎన్నికలలో పోటీ చేసే అవకాశం రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ చెప్పినట్టు ప్రచారం జరిగింది. చివరకు అలాంటి పదవులు కూడా రాలేదు. 2021 చివరలో ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఇష్టం లేకపోయినా ఆలీ ఆ పదవితో సర్దుకుపోయారు.
ఇటీవల వైసిపి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఆలీ ఆయిష్టంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ వచ్చే ఎన్నికలలో ఆలీని లోక్సభకు పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే నంద్యాల లేదా కర్నూలు సీట్లలో ఎక్కడ ఒకచోట నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఆలీ ముందు ఆప్షన్ పెట్టగా ఆలీ నంద్యాలను కోరుకున్నట్టు తెలుస్తోంది.