ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారీ నాయకులు చెప్పే మాట..`పునః పరిశీలించుకుంటాం. సరిచేసుకుం టాం.` అనే. ఈ సారి ఆ తప్పులు జరగకుండా చూసుకుంటామనే!! 2019 మేలో ఎన్నికల ఫలితాలు విడుద లైన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. `ఈ ఫలితాలను మేం ఊహించ లేదు. అయినా.. ప్రజలు ఇచ్చిన మాండేట్ను గౌరవిస్తున్నాం. ఎక్కడ తప్పులు జరిగాయో చూసుకుని వాటిని సరిచేసుకుంటాం. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్తాం` అని!!
మరి ఇప్పుడు ఆవచ్చే ఎన్నికలు రానేవచ్చాయి. మరి ఎదురు దెబ్బల నుంచి ఏం నేర్చుకున్నారు? అనేది పరిశీలిస్తే.. శూన్యమే సమాధానంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏ తప్పులు తెరమీదికి వచ్చాయో.. అవే తప్పులు వేర్వేరు చోట్ల ఇప్పుడు కూడా పునరావృతమయ్యాయి. ఉదాహరణకు రెండు నియోజకవ ర్గాలు తీసుకుంటే.. గత ఎన్నికల్లో కొవ్వూరు నియోజవర్గం నుంచి వంగలపూడి అనితకు టికెట్ ఇచ్చారు. ఆమె లోకల్ కాదు.. కాబట్టి వద్దని తమ్ముళ్లు డిమాండ్ చేశారు.
నేను మోనార్క్ అంటూ.. చంద్రబాబు తమ్ముళ్లను బెదిరించారు. వారి నోరు మూయించారు కానీ.. వేలి ముద్రలను మాత్రం మార్చలేక పోయారు. ఫలితంగా ఓటమి ఎదురు వచ్చింది. ఇప్పుడు తిరువూరులోనూ ఇదే సంకటం. నాన్లోకల్కు టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు ఇక్కడ తమ్ముళ్లు కూడా భగ్గుమంటున్నారు. దీనిని కూడా కట్టడి చేయొచ్చు.. పట్టించుకోకపోవచ్చు. కానీ, నేర్చిందేంటనేది ప్రశ్న. మరోవైపు.. శింగనమల నియోజకవర్గంలో మరో ఫార్ములా అనుసరించారు.
గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వగా.. బండారు శ్రావణి పరాజయం పాలయ్యారు. దీనికి కారణం.. స్వపక్షంలో విపక్షం. దీంతో ఎం.ఎస్. రాజును పార్టీ ప్రోత్సహించింది. ఒకానొక సందర్భంలోనే కాకుండా.. పలుమార్లు ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పింది. దీంతో ఆయన రెచ్చిపోయి.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాడు. తీరా చూస్తే.. ఇప్పుడు 2019 సీన్ రిపీట్ అయింది. బండారుపై ఉన్న అసమ్మతి మరింత పెరిగిందే తప్ప.. తగ్గలేదు. ఇది కూడా ఎదురు దెబ్బ నుంచి పాఠం నేర్వలేదనే విషయాన్ని చెబుతోంది.
ధర్మవరం.. ఈ నియోజకవర్గంలో ఇంచార్జ్గా ఉన్న పరిటాల శ్రీరాం వ్యవహారం.. నాన్చుతూనే ఉన్నారు. దీనిలోనూ క్లారిటీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లోనూ ఇలా నాన్చి నాన్చి ఇచ్చిన టికెట్ చేజేతులా వైసీపీకి అప్పగించారు. యువ రక్తం అంటే.. అయిన వాళ్లకు ఒకలా.. కానివాళ్లకు మరోలా ఉండదని.. మహానాడు వేదికగా చెప్పిన ముచ్చట చంద్రబాబు మరిచిపోయినా.. తమ్ముళ్లు గుర్తు పెట్టుకున్నారు. తన కుటుంబంలోనే నలుగురికి టికెట్లు ఇచ్చారు. యనమల కుటుంబానికి రెండు, కింజరాపు కుటుంబానికి మూడు ఇచ్చినప్పుడు.. ఇతరులు ప్రశ్నించరా.. ఇది ఎదురు దెబ్బకాదా? దీని నుంచి ఏం నేర్చుకున్నారనేది ప్రశ్న.