టీడీపీ సహా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.. చంద్రబాబు సాహసాలు చేయలేక పోయారు అని! నిజమే.. 175 స్థానాల్లో చంద్రబాబు ప్రకటించిన 94 అసెంబ్లీ సీట్లను గమనిస్తే.. భారీ స్థాయిలో చేసిన మార్పులు పైకి ఏమీ కనిపించడం లేదు. కానీ, మార్పులు జరిగాయి. 24 స్థానాల్లో మాత్రమే కొత్తవారికి అవకాశం ఇచ్చారు. మిగిలిన వాటిని పాత నేతనేతలతోనే నింపేశారు. దీనిని గమనించిన వారే.. చంద్రబాబు సాహసాలు చేయలేక పోయారనే వాదన వినిపిస్తున్నారు.
కావొచ్చు.. చంద్రబాబు సాహసం చేయలేక పోయి ఉండొచ్చు. వైసీపీ మాదిరిగా ఇష్టానుసారంగా.. నియోజ కవర్గాల నుంచి నాయకులను బదిలీ చేయలేదు. ఎక్కడ బడితే.. అక్కడ నాయకులను తీసుకువచ్చి.. స్థానికంగా ఆశలు పెట్టుకున్న మెజారిటీ నాయకులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించకపోవచ్చు. కేవలం తన గెలుపును మాత్రమే అంచనా వేసుకున్న వైసీపీ మాదిరిగా చంద్రబాబు చేయలే కోవచ్చు. అయితే.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. టికెట్ల కేటాయింపును చూస్తే.. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
1) పార్టీలో అంతర్గత కుమ్ములాటలు:
అభ్యర్థులను మార్చిన చోట, లేదా బదిలీ చేసిన చోట వైసీపీ అంతర్గత కుమ్ములాటలు ఎదుర్కొంటూనే ఉంది. నాయకులు సహకరించడం కూడా లేదు. దీంతో సమన్వయ కర్తలుగా ఉన్నవారు.. తమ తమ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇది పార్టీకి ఇబ్బందిగా మారనుంది. ఇలాంటి ప్రయత్నం చేయకుండా.. పార్టీని సాఫీగా ముందుకు నడిపించాలని చంద్రబాబు భావించారు.
2) సానుభూతి:
వైసీపీ అభ్యర్థులను మార్చడం ద్వారా.. అవినీతి , అక్రమాల వంటివాటిని తుడిచేసుకునే ప్రయత్నం చేసింది. కానీ, ప్రస్తుత టీడీపీ నేతలపై ఇలాంటి ఆరోపణలు లేవు. సో.. వారిని మార్చాల్సిన అవసరం లేదు. పైగా.. గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి ఉంటుంది. దీనిని కాపాడుకునేందుకు ఓట్లుగా మలుచుకునేందుకు వారికే టికెట్ ఇవ్వాలనే వ్యూహంతో చంద్రబాబు ముందుకు కదిలారు.
3) అనుభవం:
రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరమని.. అప్పుడే.. విభజిత రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గల్లోనూ అనుభవం ఉన్న నేతలకే పెద్ద పీట వేశారు. కేవలం పైస్థాయిలో అనుభవం ఉన్న తనను నిలబెట్టుకుని.. క్షేత్రస్థాయిలో అనుభవం లేని వారికి టికెట్ ఇస్తే.. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఆయన ప్రయోగాలు, సాహసాల జోలికి పెద్దగా పోలేదని అంటున్నారు పరిశీలకులు