Vijayawada TDP : విజయవాడ టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ముట్టడికి శనివారం కార్యకర్తలు ప్రయత్నించారు. మున్సిపల్ ఎన్నికలు టీడీపీలో చిచ్చు రాజేశాయి. 34వ డివిజన్ నుంచి టికెట్ ఆశించిన గొట్టేటి హనుమంతురావు తన అనుచరులతో కలిసి కేశినేని కార్యాలయానికి వచ్చారు.
హనుమంతరావు కూతురుతో పాటు కార్యకర్తలు కార్యాలయం ముందు బైఠాయించారు. టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 34వ డివిజన్ టికెట్ తమకే ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ కార్యకర్తలు తేల్చి చెప్పారు.మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. సొంత పార్టీ కార్యకర్తలే ఎంపీ నానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విజయవాడలో కలకలం రేపుతోంది. 34వ డివిజన్ అభ్యర్థి మార్పుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కేశినేని కార్యాలయం ముట్టడి వరకూ పరిస్థితి వెళ్లింది.
Vijayawada TDP : నిన్న 39.. నేడు 34
నిన్నమొన్నటి వరకు విజయవాడ ముప్పై తొమ్మిది వ డివిజన్ లో కూడా ఇదే తరహా విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ కేశినేని నాని వర్సెస్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య పోరు సాగింది.పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ వివాదాన్ని సమసి పుచ్చారు.
వీఎంసీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా శివశర్మను ఎంపీ కేశినేని నాని బలపరుస్తుండగా, అదే డివిజన్ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కుమార్తె పూజితను బుద్దా వెంకన్న, నాగుల్మీరాలు బలపరుస్తున్న సంగతి తెలిసిందే. ఒకే పార్టీ నుంచి ఇరువర్గాల నాయకులు అభ్యర్థులను నిలబెట్టి పోటాపోటీగా కార్యాలయాలను ప్రారంభించారు. ఇరువర్గాల నాయకులు పంతాలు, పట్టింపులకు పోతూ పరస్పరం వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఇరువర్గాల ఆధిపత్య పోరు వీధికెక్కింది. ఎంపీ కేశినేని, ఆయనకు వ్యతిరేకంగా ఏకమైన వర్గం మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ శృతి మించుతూ పార్టీకే నష్టం చేసే స్థాయికి చేరుకుంది.