తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన కోసం తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తోంది. సంక్లిష్ట సమయంలో అనుకోకుండా వచ్చిపడిన ఇంకో సంక్షోభంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న ప్రజలు గులాబీ దళపతి ఏం చెప్తారో అని నిరీక్షిస్తున్నారు.
ఎందుకంటే , తెలంగాణను మళ్లీ వైరస్ భయపెడుతోంది. గతంలో కరోనాతో కలకలం నెలకొనగా ఈసారి కొత్తరకం కరోనా స్ట్రైన్ రూపంలో ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని రాష్ట్రంలోని మారుమూల జిల్లాల వరకూ ఈ మహమ్మారి అనుమానితులు విస్తరించిన పలువురు వ్యక్తులు టెన్షన్తో కుమిలిపోతున్నారు.
లండన్ నుంచి వచ్చేశారు…
కరోనా స్ట్రైన్ మహమ్మారి పంజా విసిరిన లండన్ నుంచి ఇటీవల కాలంలో తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు ప్రయాణికులు వచ్చారు. ఇదే ఇప్పుడు టెన్షన్కు కారణం అవుతోంది. అలా వచ్చిన వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం వైద్యాధికారులు చేస్తున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ పలు జిల్లాలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. బ్రిటన్ నుంచి ఇటీవల 16 మంది వచ్చినట్టు గుర్తించడంతో కరీంనగర్ జిల్లాలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇలా వచ్చిన వారిలో 10 మ మందిని గుర్తించి శాంపిల్స్ సేకరించగా ఆరుగురుని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. జహీరాబాద్కు 12 మంది, సంగారెడ్డికి 6 గురు, పఠాన్చెరువుకు ఏడుగురు, సదాశివపేటకు ఒకరు బ్రిటన్ నుంచి వచ్చారు. వారిలో 17 మంది రిపోర్ట్స్ నెగిటివ్ రాగా, మిగిలిన వారి రిపోర్ట్స్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు..
హైదరాబాద్ ఆనుకొని ఉన్న జిల్లాల్లో …
లండన్ నుంచి నల్గొండ జిల్లాకు ఎనిమిది మంది వచ్చారు. అక్కడ నుంచి ఒకరు విజయవాడ, మరొకరు నిజామాబాద్ వెళ్లారు. మిగిలిన ఆరుగురి ప్రయాణికులకు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ వచ్చే వరకు వారిని క్వారంటైన్లో ఉంచారు. సంగారెడ్డి జిల్లాకు గత 20 రోజుల్లో లండన్ నుంచి26 మంది వచ్చినట్టు తెలుస్తోంది. అందరినీ ఇప్పటికే ట్రేస్ చేసి వైద్యాధికారులు శాంపిల్స్ సేకరించారు .
సరిహద్దు జిల్లాలోనూ టెన్షన్
ఖమ్మం జిల్లాను కొత్త వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ నుంచి ఇటీవల విడతల వారీగా 27 మంది వచ్చినట్టు సమాచారం. అందులో ఖమ్మం నగరానికి చెందిన వారు 20 మంది ఉన్నారు. మిగిలిన వారు సత్తుపల్లి, వైరా, తిరుమలాయపాలెం ప్రాంతాలకు చెందినవారని తెలుస్తోంది. వారందరన్నీ ట్రేస్ చేసి ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ ద్వారా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన సరిహద్దు జిల్లాల్లో ఒకటైన కొమురంభీం జిల్లా దహేగాం మండలానికి ఇటీవలే బ్రిటన్ నుంచి వచ్చిన ముగ్గురి శాంపిల్స్ సేకరించారు. 14 రోజుల కిందట ముగ్గురు బ్రిటన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. అందులో ఇద్దరి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించడమో లేదా అధికారులతో రివ్యూలు చేస్తేనే ప్రజల్లో భరోసా పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.