మహారాష్ట్రలోని భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. ఆసుపత్రిలోని పిల్లలున్న కేర్ యూనిట్ (ఎస్ఎన్సియూ) లో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 17 మంది పిల్లలుండగా వారిలో ఏడుగురిని రక్షించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో డ్యూటీలో ఉన్న ఓ నర్సు గదిలో పొగ రావడం గుర్తించింది. ఆ తర్వాత నర్సు ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేసింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంటల నుంచి కాపాడిన పిల్లలను వేరే వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అసలు మంటలు ఎందుకు వ్యాపించాయి? ఐఎన్సీయూ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. ఈ దుర్ఘటన పై ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ కు ఆదేశించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తదితర ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. దుర్ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.