Fire Accident: అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుత్తి రోడ్డులోని హనుమాన్ గోడౌన్ నందు అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపుగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
గోడౌన్ లో ఫ్రిజ్ లు, ఎయిర్ కూలర్, ఏసీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరంగా మారింది. జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ అగ్నిమాపక శాఖాధికారి లింగమయ్య ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోడౌన్ చుట్టుపక్కల నివాస గృహాలు, సమీపంలోనే ఆయిల్ మిల్ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందారు.
మంటలను ఆర్పేందుకు నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో మున్సిపల్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. ఎట్టకేలకు అతి కష్టం మీద ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని, దాదాపు రూ.2కోట్ల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని గోడౌన్ యజమాని గురుప్రసాద్ అంటున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి మాత్రం రికార్డులు పరిశీలించిన తర్వాతనే నష్టం ఎంత అనేది చెబుతామని అన్నారు. పూర్తి స్థాయిలో రికార్డులు అప్పగించాలని, అందుకు అనుగుణంగా విచారణ చేసి నష్టాన్ని నిర్ధారిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ గోడౌన్ కు సంబంధించి ఎలాంటి అనుమతులూ లేవని, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫైర్ అధికారులు అంటున్నారు.