ప్రతి రోజు లాగానే ఆ రోజు కూడా మొదలైంది కానీ ఆ రోజు ముగిసే సమయానికి లక్షల మంది చనిపోయారు. నేటితో ఆ విధ్వంసం జరిగి 16 ఏళ్లు పూర్తి అయ్యాయి. మృత్యువు నీటి రూపంలో వచ్చి లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అదే 2004 డిసెంబరు 26న హిందూ మహా సముద్రంలో వచ్చిన సునామి. ఈ సునామీ సుమత్రా మరియు ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడింది. మొత్తం 14 దేశాల్లో ఈ సునామి తన ప్రభావాన్ని చూపింది. సుమారు 2,30,000 మందిని మృత్యువాత పడేలా చేసింది. దీని పరిమాణం రిచ్టర్ స్కేలు మీద 9.1–9.3 గా నమోదయ్యింది.
భారత్ మరియు బర్మా భూభాగానికి చెందిన టెక్టానిక్ ప్లేట్ల రాపిడితో సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రం లోని అలలు సుమారు 30 మీటర్ల ఎత్తుకు చేరుకొని తీర ప్రాంతాలను ముంచి వేశాయి. ప్రపంచం లోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఈ సునామి ఒకటిగా నిలిచింది. ఇది మూడో అతి పెద్ద భూకంపంగా సీస్మోగ్రాఫు మీద రికార్డు అయ్యింది. ఈ భూకంప సమయంలో భూమి 8.3 నుంచి 10 నిమిషాల పాటు కంపించింది.
ఎక్కడో దూరాన ఉన్న అలస్కాలో కూడా దీని ప్రభావం కనిపించింది. ఈ భూకంపం పరిమాణాన్ని మొదటగా 8.8 గా ప్రకటించినప్పటికీ తర్వాత సంవత్సరం ఫిబ్రవరిలో శాస్త్రజ్ఞులు దీన్ని మళ్ళీ 9.0 కి సవరించగా దీనిని ఫసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఆమోదించింది.
2004 లో సంభవించిన సునామి కారణంగా మొత్తం 14 దేశాలు దీని ఫలితాలు చూశాయి. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అనధికారంగా మొత్తం 10 లక్షల మంది సునామికి బలైపోయారట మరియు కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది జీవనోపాధి కోల్పోయారు.