Nara Lokesh: టీడీపీ అధినేత, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టు అవ్వడంతో నారా లోకేష్ యువగళం పాదయాత్రను అర్ధాంతరంగా నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును కేసుల నుండి బయటకు తీసుకువచ్చేందుకు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లి పెద్ద పెద్ద (పేరుమోసిన ) న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు వరకూ ఎక్కడా చంద్రబాబు కు ఇప్పటి వరకూ తక్షణ ఉపశమనం లభించలేదు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉండి మూడు వారాలు కావొస్తోంది.

మరో పక్క చంద్రబాబుపై మరో మూడు కేసులు తోడయ్యాయి. రెండు కేసుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చూపేందుకు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. మరో పక్క అంగళ్లు ఘటనలోనూ చంద్రబాబుపై హత్యాయత్నం కేసు కూడా ఉంది. రోజులు గడుస్తున్నా చంద్రబాబు బయటకు రాకపోవడంతో నారా లోకేష్ తన పాదయాత్రను పునః ప్రారంభించాలని భావించారు. ఈ తరుణంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ 14గా పేర్కొంటూ ఏపీ సీఐడీ చేర్చింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లోనూ లోకేష్ పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తూ దర్యాప్తు జరుపుతున్నారు. ఫైబర్ నెట్ కేసులోనూ లోకేష్ ఉన్నాడని ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు.
ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి పూనుకుంటే వెంటనే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు జైల్ లో ఉండగా, నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తే పార్టీ పరిస్థితి మరింత గందరగోళంలోకి నెట్టివేయబడుతుందని భావిస్తున్నారుట. అందుకే లోకేష్ ఇప్పట్లో పాదయాత్ర చేసే ఆలోచన మానుకోవాలని పార్టీ నేతలు సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే తన పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టుకు భయపడే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
దర్యాప్తు అధికారులు ఎప్పుడు అరెస్టు చేయాలనుకుంటే అప్పుడు లోకేష్ ను అరెస్టు చేస్తారనీ, చంద్రబాబు కంటే లోకేష్ ఏమైనా గొప్పవాడా అని మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ చేశారు. మరో పక్క వాస్తవానికి నారా లోకేష్ తన పాదయాత్రను ఈ నెల 29వ తేదీ నుండి పునః ప్రారంభించాలని భావించారు. దాదాపు 20 రోజుల బ్రేక్ తర్వాత పాదయాత్ర పునః ప్రారంభానికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఎక్కడైతే పాదయాత్రను నిలుపుదల చేశారో (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం) నుండి పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కోసులో సుప్రీం కోర్టులో అక్టోబర్ 3వ తేదీన వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పునః ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్యనేతలు లోకేష్ ని కోరారుట.
ఢిల్లీలో న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారుట. లోకేష్ పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని పార్టీ ముఖ్యనేతలు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారనీ, వారి అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్ .. యువగళం పాదయాత్ర పునః ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పునః ప్రారంభ తేదీని ప్రకటించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నా.. న్యాయస్థానాల్లో చంద్రబాబు కు రిలీఫ్ దొరికే వరకూ లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభించే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. అరెస్టు చేస్తారన్న భయంలోనే లోకేష్ పాదయాత్రను పునః ప్రారంభించడం లేదని కూడా వ్యతిరేక మీడియా ప్రచారం చేస్తొంది.